60 మందిని ఐసిస్లో చేర్చా: 'నెలకు రూ. 6,600 ఇచ్చేవారు'
చెన్నై: ఐసిస్లో ఉగ్రవాదిగా పనిచేసి, భారత్లో విధ్వంసం జరిపేందుకు వచ్చి అరెస్టయిన సుభానీ హాజా మొయిద్దీన్ విచారణలో పోలీసులు పలు ఆసక్తికర విషయాలను కనుగొన్నారు. ఇరాక్ వెళ్లిన తనకు మోసుల్లో శిక్షణ ఇచ్చారని, ఆపై ఐసిస్ ఉగ్రవాదులతో కలసి తాను పోరాడానని చెప్పాడు.
అనంతంరం భారత్కు వచ్చిన తర్వాత గడచిన రెండేళ్లలో 60 మందికి పైగా ఐసిస్లో చేర్చినట్లు వెల్లడించాడు. కేరళలోని ఇడుక్కి ప్రాంతానికి చెందిన మొయిద్దీన్, ఇటీవలే భారత్కు వచ్చి సౌత్లో ఉగ్రదాడులకు కుట్ర చేసేందుకు పథకం రచిస్తుండగా ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
2015 ఏప్రిల్ 8న యాత్రకని ఇంట్లో తల్లిదండ్రులకు, భార్యకు చెప్పిన తాను, ఇస్తాంబుల్ మీదుగా ఇరాక్ వెళ్లానని, విజిటింగ్ వీసాపై చెన్నై నుంచే తన ప్రయాణం మొదలైందని మొయిద్దీన్ విచారణలో వెల్లడించాడు. ఇస్తాంబుల్ వెళ్లిన తర్వాత, కొంతమంది పాకిస్థాన్, ఆఫ్గనిస్థాన్కు చెందిన ఫైటర్లతో కలసి సరిహద్దులు దాటి ఇరాక్లోకి ప్రవేశించినట్టు చెప్పాడు.
తనతో పాటు 30 మందికి ఐసిస్ ఉగ్రవాదులు శిక్షణ ఇచ్చారని, అందులో ఆస్ట్రేలియా, లెబనాన్ తదితర దేశాల నుంచి వచ్చిన వారు కూడా ఉన్నారని తెలిపాడు. తనకు ఆప్ఘనిస్థాన్కు చెందిన ట్రైనర్ చాలా కఠినమైన శిక్షణ ఇచ్చాడని, ఉదయం నుంచి సాయంత్రం వరకూ శిక్షణ ఇచ్చి, చిన్న చిన్న గదుల్లో ఉంచేవారని తెలిపాడు.
శిక్షణ అనంతరం మొదట్లో కాపలా కాసే బాధ్యతలు, ఆ తర్వాత వార్ జోన్కు పంపారని తెలిపాడు. కుర్దిష్, ఇరాకీ సైన్యంతో తలపడ్డానని, అందుకు నెలకు 100 యూఎస్ డాలర్లు (సుమారు రూ. 6,600) ఇచ్చారని తెలిపాడు. సెప్టెంబర్ లో తిరిగి ఇస్తాంబుల్కు వెళ్లి, రెండు వారాల పాటు ఉండి, ఆపై ఇండియన్ కాన్సులేట్ అధికారులను కలిసి, ముంబై మీదుగా ఇండియాకు వచ్చినట్టు చెప్పాడు.
ఆపై తిరునల్వేలిలో ఓ ఆభరణాల దుకాణంలో పనికి కుదిరి పేలుళ్లకు ప్లాన్ వేస్తున్నామని పేర్కొన్నాడు. శివకాశీ నుంచి రసాయనాలు తెచ్చి, బాంబులు తయారు చేసి వివిధ ప్రాంతాల్లో ఒకే చోట పేల్చాలన్నది తమ లక్ష్యమని వివరించాడు. ఇందులో భాగంగా కేరళ హైకోర్టు న్యాయమూర్తులు, ఆర్ఎస్ఎస్ నేతలను హత్య చేసేందుకు ప్లాన్ వేసినట్టు వెల్లడించాడు.