దూకుడు లేదు కానీ: నల్లధనంపై జైట్లీ, కీలక నిర్ణయాలు
న్యూఢిల్లీ: విదేశీ బ్యాంకుల్లో నల్లధనం దాచిపెట్టిన వారి పేర్లను బహిర్గతం చేసి శిక్షించి తీరడం ఖాయమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శనివారం స్పష్టం చేశారు. ఈ విషయంలో తమ ప్రభుత్వం వెనుకంజ వేసే ప్రసక్తి లేదన్నారు. అయితే చట్ట ప్రకారం ప్రక్రియను పూర్తి చేసిన తరువాతే బ్లాక్ లిస్ట్ బహిర్గతం చేయడం సాధ్యమన్నారు. తొందరపడి వివరాలు బయటపెడితే, నల్లధనం దాచిన వ్యక్తుల వివరాలను ఆయా దేశాలు ఇవ్వకుంటే మొదటికే మోసం వస్తుందన్నారు.
నల్లధనం దాచినవారి పేర్లు బయటపెట్టి, సొమ్మును వెనక్కి తీసుకొచ్చే విషయంలో తమ ప్రభుత్వం చేసిన ప్రకటనకు విరద్ధంగా వ్యవహరిస్తున్నట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. విదేశీ బ్యాంకులలో మూలుగుతున్న మన దేశానికి చెందిన నల్లధనాన్ని వెనక్కి తెచ్చేందుకు చట్టబద్ధంగా వ్యవహరించాల్సి ఉందన్నారు. 1995లో అప్పటి కాంగ్రేస్ ప్రభుత్వం వివిధ దేశాలతో కుదుర్చుకున్న డబుల్ టాక్సేషన్ ఒప్పందాన్ని ఉల్లంఘించి తొందరపాటుతో వ్యవహరిస్తే మొదటికే మోసమౌతుందన్నారు.

నల్లధనం విషయంలో జరిగిన ఒక కేసు విచారణలో సుప్రీం కోర్టు, ఈ విషయంపై పిటిషన్ దాఖలు చేసిన వారి పేర్లు బయట పెట్టాల్సిందిగా ఆదేశించింది. సుప్రీం ఆదేశాల మేరకు ప్రభుత్వం పిటిషనర్ల జాబితాను బయటపెట్టింది. జాబితా బయటకు రావటంతో తమ దేశంలో నల్లధనం దాచుకున్న వారి పేర్లను భారత్కు తెలియజేయాల్సిన జర్మనీ తీవ్ర అభ్యంతరాలు లేవదీసింది.
రహస్యానికి తూట్లు పొడిచినందున విచారణ లేదా సమాచారాన్ని అందచేసేది లేదని తెగేసి చెప్పటంతో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చిందని జైట్లీ వెల్లడించారు. ప్రభుత్వం ఆచి తూచి వ్యవహరించకుంటే విదేశీ బ్యాంకుల నుంచి అందాల్సిన సహకారం అందే అవకాశాలు ఉండవని ఆయన చెప్పారు. విదేశీ బ్యాంకులు సహాయ నిరాకరణకు దిగితే నల్లధనాన్ని దాచినవారు హాయిగా తప్పించుకునే అవకాశాలు ఉన్నాయని జైట్లీ అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వం నియమ నిబంధలను ఉల్లంఘించకుండా నల్లధనం దాచినవారి పేర్లను సేకరించి కఠినంగా శిక్షించి తీరుతుందని భరోసా ఇచ్చారు. ఈ విషయంలో తమ ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించాల్సిర అవసరం లేదన్నారు. నల్లధనాన్ని వెనక్కి తీసుకొచ్చే క్రమంలో ఇతర దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలలు చేసుకోవటానికి అవకాశం ఉందా? లేదా? అన్న విషయంపై ఆదేశాలు ఇవ్వాల్సిందిగా మాత్రమే సుప్రీంను కోరాం తప్పించి, నల్లధనం దాచినవారి పేర్ల బహిర్గతంపై కోర్టుకు ఏమీ చెప్పలేదన్నారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నల్లధనం వివరాల సేకరణకు ప్రత్యేక విచారణ బృందాన్ని నియమించిందన్నారు. ఈ ప్రతినిధి వర్గం స్విట్జర్లాండ్లో పర్యటించి వివిధ బ్యాంకులతో సంప్రదించి అవసరమైన సమాచారాన్ని సేకరించిందన్నారు.
డీజిల్ పైన నియంత్రణ ఎత్తివేత
సంస్కరణల దిశగా కేంద్రంలోని ఎన్డీయే సర్కారు కీలక ముందడుగు వేసింది. చమురు రంగానికి సంబంధించి దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. డీజిల్ ధరల పైన నియంత్రణను ఎత్తివేసింది. దీని ప్రభావం వెంటనే కనిపించింది. డీజిల్ ధర లీటరుకు రూ.3.37 పైసలు తగ్గింది. శనివారం అర్ధరాత్రి నుండి ఇది అమల్లోకి వచ్చింది. వంట గ్యాస్ సబ్సిడీకి ఆధార్ తప్పనిసరి కాదని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది.












Click it and Unblock the Notifications