ఓ మంత్రి నాపై దాడికి యత్నించారు: గవర్నర్
ఈటానగర్: అరుణాచలప్రదేశ్ రాష్ట్ర మంత్రే స్వయంగా తనపై దాడికి ప్రయత్నించారని ఆ రాష్ట్ర గవర్నర్ జేపీ రాజ్ఖోవా ఆరోపించారు. ఈ మేరకు ఓ నివేదికను గురువారం మధ్యాహ్నం ఆయన ఓ సీల్డ్ కవర్ ద్వారా సుప్రీంకోర్టుకు సమర్పించే అవకాశం ఉంది.
రాష్ట్రంలో దిగజారుతున్న శాంతి భద్రతల అంశాన్ని కూడా ఆయన ఆ నివేదికల ద్వారా సుప్రీంకు తెలియజేయనున్నారు.అప్పటి ముఖ్యమంత్రి నబమ్ టుకి మంత్రివర్గంలోని మంత్రులు గత డిసెంబరు 14న గవర్నర్ని కలిసేందుకు వెళ్లారు.
రాష్ట్రంలో ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల్ని ముందుకు జరపాలని గవర్నర్ వారికి సూచించారు. ఆ సందర్భంలో అక్కడున్న మంత్రి ఒకరు తనపై దాడి చెయ్యడానికి యత్నించారని రాజ్ఖోవా ఆరోపించారు. రాజ్భవన్ వచ్చే దారిని కూడా ముఖ్యమంత్రి మనుషులు మూసివేశారని చెప్పారు.
రాష్ట్రంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులు వివరిస్తూ జనవరి 18న రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్ కోరారు. ఈ నేపథ్యంలో గత మంగళవారం నుంచి రాష్ట్రపతి పాలన అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే.