అరవింద్ కేజ్రీవాల్ ఆస్తులు ఎన్ని కోట్లంటే?
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) బుధవారం అసెంబ్లీ ఎన్నికల కోసం నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్లో అరవింద్ కేజ్రీవాల్ తన ఆస్తులకు సంబంధించిన వివరాలను పేర్కొన్నారు.
తనకు రూ. 1.73 కోట్లు ఆస్తులు ఉన్నాయని కేజ్రీవాల్ తన అఫిడవిట్లో వెల్లడించారు. ఎన్నికల కమిషన్కు సమర్పించిన పత్రాల ప్రకారం బ్యాంకులో ఆయనకు 2.96 లక్షల సేవింగ్స్, రూ. 50 వేల నగదు ఉన్నట్లు పేర్కొన్నారు. మొత్తం స్థిరాస్తుల విలువ రూ. 1.7 కోట్లుగా ప్రకటించారు. అంతేగాక, తనకు సొంత ఇల్లు, కారు లేవనే విషయాన్ని నామినేషన్ పత్రాల్లో పొందుపర్చారు.

2023-2024లో అరవింద్ కేజ్రీవాల్ కు రూ. 7.21 లక్షల ఆదాయం సమకూరిందని తన అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇక, అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ మొత్తం ఆస్తుల విలువ రూ. 2.5 కోట్లు. ఇందులో రూ. కోటికిపైగా చరాస్తులు, వాటిలో రూ. 25 లక్షల విలువైన 320 గ్రాముల బంగారం, రూ. 92 వేల విలువైన కిలో వెండి ఉన్నట్లు వెల్లడించారు. సునీతకు మాత్రం గురుగ్రామ్లో ఇల్లు, సొంతంగా కారు ఉన్నట్లు తెలిపారు. కేజ్రీవాల్ దంపతులిద్దరి ఆస్తుల విలువ రూ. 4.23 కోట్లుగా వెల్లడించారు.
కాగా, న్యూఢిల్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న అరవింద్ కేజ్రీవాల్ 2020లో తన ఆస్తుల విలువ రూ. 3.4 కోట్లుగా ప్రకటించారు. ఆ తర్వాత 2015లో రూ. 2.1 కోట్లు అని వెల్లడించారు. క్రమంగా కేజ్రీవాల్ ఆస్తులు తగ్గినట్లుగా చూపిస్తుండటం గమనార్హం. ఇక, మొత్తం 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5న ఒకే విడతలో ఎన్నికలు జరగనుండగా.. ఫిబ్రవరి 8న ఫలితాలు వెలువడనున్నాయి.












Click it and Unblock the Notifications