కేసీఆర్ లాగే.. కేజ్రీవాల్ చేయబోతున్నారు!: పంజాబ్ ఎన్నికల ర్యాలీలో ప్రకటన
శుక్రవారం నాడు పంజాబ్ ఎన్నికల ర్యాలీలో భాగంగా పార్టీ దళిత్ మేనిఫెస్టోను ప్రకటించారు కేజ్రీవాల్. పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తే.. దళితున్ని ఉపముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించారు.
న్యూఢిల్లీ : తెలంగాణలో అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత సీఎం కేసీఆర్ దళితున్ని ఉపముఖ్యమంత్రి చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడిదే బాటలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా నడవబోతున్నారు. శుక్రవారం నాడు పంజాబ్ ఎన్నికల ర్యాలీలో భాగంగా పార్టీ దళిత్ మేనిఫెస్టోను ప్రకటించారు కేజ్రీవాల్.
ఈ సందర్బంగా.. పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తే.. దళితున్ని ఉపముఖ్యమంత్రిని చేస్తామని కేజ్రీవాల్ ప్రకటించారు. సీఎం అభ్యర్థిగా ఎవరిని ప్రకటిస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో.. డిప్యూటీ సీఎంకు సంబంధించిన ప్రకటన ఆసక్తిని రేకెత్తిస్తోంది. జలంధర్ లోని ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన ఫిల్లౌర్ లో ఈ ప్రకటన చేశారు.
డిప్యూటీ సీఎంగా దళిత నేతను ఎంపిక చేస్తామని కేజ్రీవాల్ ప్రకటించడంతో.. పార్టీకి చెందిన పలువురు ప్రముఖ దళిత నేతల పేర్లు తెరపైకి వస్తున్నాయి. మోహన్ సింగ్ పల్లియన్ వాలా(ఫిరోజ్ పూర్), ప్రకాశ్ సింగ్ జందాలి(లూథియానా), గుర్ సింగ్ దేవ్(దేవ్ మన్) పేర్లు డిప్యూటీ సీఎం పదవి కోసం ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
కాగా, పంజాబ్ మొత్తం జనాభాలో దళితుల జనాభా 31శాతం. దేశంలో అత్యధికంగా దళితులు ఉన్న రాష్ట్రాల్లో పంజాబ్ కూడా ఒకటి. అయితే దళితున్ని డిప్యూటీ సీఎంగా చేస్తానన్న కేజ్రీవాల్ ప్రకటన.. ఆమ్ ఆద్మీకి ఎంతమేర కలిసొస్తుందనేది వేచి చూడాలి.