నిజాయితీకి పెద్దపీట, మేం వారిని పట్టుకుంటాం: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: తాము సమర్థులు, నిజాయితీపరులైన వారి కోసం అన్వేషిస్తున్నామని, వారికే తగిన పదవులు ఇచ్చి గౌరవిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ(ఎఎపి) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ గురువారం అన్నారు. అలాంటి వారిని వెదికి పట్టుకునేందుకు తమ వద్ద ప్రత్యేక యంత్రాంగం ఉందన్నారు.
కేజ్రీవాల్ ఈ నెల 28వ తేదీన ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడంతో ఎఎపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. కేజ్రీవాల్తో పాటు మరో ఆరుగురు ఎమ్మెలేలు మంత్రులుగా ప్రమాణం చేస్తారు. ఈ సందర్భంగా ఉదయం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ రామ్లీలా మైదాన్లో జరిగే ఈ కార్యక్రమానికి అందరూ రావాల్సిందిగా మీడియా ద్వారా ఆహ్వానించారు. అందరికీ ఆహ్వానం ఉందని, ప్రత్యేకంగా విఐపిలు అంటూ ఉండరన్నారు.

మరోవైపు నిజాయితీగల అధికారులు తనను ఎస్సెమ్మెస్, లేఖలు, మెయిల్స్ ద్వారా సంప్రదించాలని కేజ్రీవాల్ కోరారు. అలాంటి అధికారులకు తమ ప్రభుత్వ హయాంలో మంచి స్థానం కల్పిస్తామని, వారి సలహాలను, సూచనలను తీసుకుంటామని చెప్పారు. అదే సమయంలో నిజాయితీ గల మాజీ అధికారులు తనను కలిస్తే న్యాయం చేస్తానని చెప్పారు.
కాగా, ఢిల్లీ లెఫ్ట్నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఈ మేరకు అరవింద్ కేజ్రీవాల్ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. జనవరి మూడవ తేదీలోగా బలనిరూపణ చేసుకోవాలని పేర్కొన్నారు. అమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటుపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకు గవర్నర్ నజీబ్ జంగ్ లేఖ రాశారు. దీనికి రాష్ట్రపతి కూడా ఆమోదించారు. దీంతో గవర్నర్ ఎఎపి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. అతి పిన్న వయసులో ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ రికార్డు సృష్టించనున్నారు.












Click it and Unblock the Notifications