కేజ్రీ ప్రమాణ స్వీకారం: ఈసారి కారులో, ముస్తాబైన రామ్ లీలా
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ 8వ ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మధ్యాహ్నాం 12.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. కేజ్రీవాల్ కుటుంబ సభ్యులతో కలిసి శనివారం ఉదయం 10.30కి ఇంటినుంచి బయలుదేరారు.
గతంలో మెట్రోరైలు లో ప్రయాణిస్తూ, ప్రజలను పలకరిస్తూ ప్రమాణస్వీకరానికి హాజరై సంచలనం సృష్టంచిన అరవింద్ కేజ్రీవాల్ ఈ సారి మాత్రం కారులో రోడ్డుమార్గంలో వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. కాగా గత మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న కేజ్రీవాల్ నిరసంగా ఉన్నారని ఆప్ నేతలు పేర్కొన్నారు.
అయితే ఆయన ఆరోగ్యం సహకరిస్తే ఈ సారి మార్గమధ్యంలో ప్రజలను కలుస్తారని ఆప్ నేతలు తెలిపారు. మరోవైపు ప్రోటోకాల్ నిబంధనలు అనుసరించి అన్ని రక్షణ ఏర్పాట్లు చేశామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అరవింద్ కేజ్రీవాల్తో పాటు ఐదుగురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
మనీష్ సిపోడియా డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. మంత్రులుగా సత్యేంద్ర జైన్, జితేంద్ర తోమర్, గోపాల్ రాయ్, సందీప్కుమార్, ఆసిం అహ్మద్ ఖాన్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. రామ్లీలా మైదానంలో ప్రమాణస్వీకార కార్యక్రమం ముగిసిన అనంతరం అరవింద్ కేజ్రీవాల్ రాజ్ఘాట్కు చేరుకోనున్నారు.
అక్కడ జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులు ఆర్పించనున్నారు. ఆ తర్వాత ఢిల్లీ సచివాలయానికి కేజ్రీవాల్ వెళ్లనున్నారు. ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం సాయంత్రం 4.30 గంటలకు మంత్రివర్గం సమావేశమవుతుంది. అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారానికి ఢిల్లీలోని రామ్ లీలా మైదానం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.
రామ్లీలా మైదానాన్ని ఆప్ వాలంటీర్స్ సుందరంగా అలంకరించారు. 35 వేల మందిని కూర్చోనేందుకు వీలుగా కుర్చీలను ఏర్పాటు చేశారు. 9 వాటర్ ట్యాంకర్స్ను అందుబాటులో ఉంచారు. 7 మొబైల్ టాయిలెట్స్ను ఏర్పాటు చేశారు. మైదానంలోకి లోపలికి, బయటకు వెళ్లేందుకు 6 గేట్లను ఏర్పాటు చేశారు. ప్రతి గేటు వద్ద మెటల్ డిటేక్టర్లను ఏర్పాటు చేశారు.
అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్కరిని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ రావాలని ఢిల్లీ ప్రజలను కేజ్రీవాల్ రేడియోలో ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేజ్రీ అభిమానులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది.
ఢిల్లీ అసెంబ్లీలో ఉన్న 70 స్ధానాలకు గాను ఆమ్ ఆద్మీ పార్టీ 67 స్ధానాలను కైవసం చేసుకుని అతి పెద్ద పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే.