మొబైల్ మెకానిక్ చేతుల్లో చన్నీ ఓటమి-పంజాబ్ గెలుపుపై కేజ్రివాల్ ఉద్వేగం-ఇక దేశమంతా
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పంజాబ్ లో జరిగిన పోరులో ఏకపక్షంగా కాంగ్రెస్, బీజేపీ, అకాలీదళ్ ను ఊడ్చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ సంబరాల్లో మునిగితేలుతోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ ఢిల్లీలో కార్యకర్తలతో ఏర్పాటు చేసిన బహిరంగ భేటీలో మాట్లాడారు. పంజాబ్ లో విప్లవం తెచ్చారంటూ సీఎం అభ్యర్ధి భగవంత్ మాన్ ను కేజ్రీ ప్రశంసలతో ముంచెత్తారు.
స్వాతంత్రం తర్వాత దేశంలో వ్యవస్ధ మారకపోతే ఏదీ మారదంటూ విప్లవవీరుడు భగత్ సింగ్ వ్యాఖ్యల్ని అరవింద్ కేజ్రివాల్ గుర్తుచేశారు. స్వాతంత్రం వచ్చిన 75 ఏళ్లలో వీరు (ప్రత్యర్ధులు) ఏమీ మార్చలేకపోయారని కేజ్రీ దుమ్మెత్తిపోశారు. ఆప్ మాత్రం దేశ రాజకీయాల్ని మారుస్తోందన్నారు. తాము వ్యవస్ధను మార్చామని, స్కూళ్లు, ఆస్పత్రులను అద్భుతంగా తీర్చిదిద్దామని చెప్పుకొచ్చారు. పంజాబ్ లో ప్రజలు చన్నీని ఓడించారు, సిద్ధూను ఓడించారు, విక్రమ్ మజీథియాను ఓడించారు, బాదల్ ను ఓడించారని, కానీ తమను మాత్రం గెలిపించారని కేజ్రివాల్ తెలిపారు.
పంజాబ్ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీలో చేరాలని కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. తాజా ఫలితాల నేపథ్యంలో ఆప్లో చేరాలని పంజాబ్ ప్రజలను ఆయన కోరారు. కొన్నిసార్లు ప్రజలను వారు సామాన్యులు కాబట్టి ఏం చేయగలరో అని అనుకుంటారని, కానీ ఈ రోజు చన్నీని ఎవరు ఓడించారు- ఓ మొబైల్ రిపేర్ షాప్లో పనిచేసే వ్యక్తి కాదా అని కేజ్రీవాల్ ప్రశ్నించారు.
తనను తీవ్రవాది అని విమర్శించిన వారిపై తాను ప్రతి విమర్శలు చేయలేదని, ఇవాళ తాను తీవ్రవాదిని కాదనీ పంజాబ్ ప్రజలు తీర్పిచ్చారని కేజ్రీ గుర్తుచేశారు. అలాగే ఢిల్లీ, పంజాబ్ లో విప్లవం వచ్చిందని, ఇప్పుడు అది దేశవ్యాప్తం కావాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రజలు ఆప్ లో చేరాలని కేజ్రివాల్ పిలుపునిచ్చారు.