ఢిల్లీలో దీదీ హల్చల్: మమతను కలిసిన ఢిల్లీ సీఎం అరవింద్ క్రేజీవాల్ -కలిసొచ్చేందుకు రెడీ
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బలమైన మోదీ-షా ద్వయాన్ని పడగొట్టిన తర్వాత మమతా బెనర్జీ తొలిసారి చేపట్టిన ఢిల్లీ పర్యటన అత్యంత ఆసక్తికరంగా సాగింది. మూడు రోజుల పర్యటన కోసం ఢిల్లీకి వచ్చిన దీదీ.. తొలుత ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిసి అదనపు టీకాలు కోరారు. ఆ తర్వాత ఆమె జరిపినవన్నీ రాజకీయ భేటీలే కావడం గమనార్హం.
దీదీ ఢిల్లీలో ఉండగానే పెగాసస్ స్పైవేర్ ఉదంతంపై పార్లమెంటు లోపల, బయట విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడం, ఇవాళ సాయంత్రం ఆమె.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇంటికెళ్లి చాయ్ తాగి రాజకీయాలు మాట్లాడటం తెలిసిందే. కోల్ కతా వెళ్లడానికి ముందు ఇవాళ రాత్రి మమతను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కలుసుకున్నారు.

టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ నివాసానికి వచ్చిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. అక్కడ మమతతో దాదాపు అరగంటసేపు సమావేశమయ్యారు. కేంద్రంలో బీజేపీని అడ్డుకునేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి మూడవ ఫ్రంట్ ఏర్పడాలన్న ప్రతిపాదన నేపథ్యంలో తన వైపు నుంచి అవసరమైన మద్దతు ఉంటుందని, కలిసి రావడానికి సిద్దంగా ఉన్నానని కేజ్రీవాల్ చెప్పినట్లు తెలుస్తోంది.
మమతా బెనర్జీతో భేటీ అనంతరం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ.. ''బెంగాల్ లో బీజేపీని చిత్తు చేసి మూడో సారి సీఎం అయిన తర్వాత మమతను కలవడం ఇదే మొదటిసారి. బంపర్ విక్టరీ కొట్టిన ఆమెకు నేను అభినందనలు తెలిపాను. అలాగే, వర్తమాన రాజకీయ అంశాలపైనా లోతుగా మాట్లాడుకున్నాం..'' అని చెప్పారు.












Click it and Unblock the Notifications