గుజరాత్ ప్రజలకు కీలక సందేశం ఇచ్చిన కేజ్రీవాల్!
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆప్ శరవేగంగా దూసుకుపోతోంది. తాజాగా ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఈ ఎన్నికల్లో తాము తప్పకుండా విజయం సాధిస్తామని పేర్కొంటూ ప్రజలకు తాను ఒక ప్రియమైన సందేశాన్ని ఇస్తున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి ట్విటర్ లో ఆయన వీడియో విడుదల చేశారు.
తాను గుజరాత్ ప్రజందరికీ సోదరుడిలాంటివాడినని, తమ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. ఆప్ అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్తు ఇవ్వడంతోపాటు పాఠశాలలు, ఆసుపత్రులు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ప్రజలందరినీ అయోధ్యలోని రామ మందిరం చూడటానికి తీసుకువెళతానన్నారు. ప్రజలు కూడా బీజేపీ ప్రభుత్వాన్ని మార్చడానికి సిద్ధమయ్యారని, తప్పకుండా తాము విజయం సాధిస్తామన్నారు. గుజరాత్ లో మొత్తం 182 నియోజకవర్గాలున్నాయి. వీటిలో 90 నుంచి 95 స్థానాలు దక్కించుకుంటామన్నారు. ఒకవేళ ప్రజలు ఇదే జోరును కొనసాగిస్తే 140 నుంచి 150 సీట్లలో గెలస్తామనే నమ్మకం ఉందన్నారు.
గుజరాత్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, బీజేపీ పాలనతో విసిగిపోయారని, ఆ పార్టీ పాలనలో చోటుచేసుకుంటున్న అవినీతికి మోర్బీ తీగల వంతెన దుర్ఘటన మన కళ్లముందు ఉంచిందన్నారు. గుజరాత్లో మొత్తం అసెంబ్లీ స్థానాల్లో ఆప్ పోటీచేస్తోంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 30 సీట్లలో పోటీ చేసినప్పటికీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఇప్పుడు మాత్రం ఆ పార్టీకి ప్రజల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తోంది. అరవింద్ కేజ్రీవాల్ తోపాటు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా గుజరాత్ లో ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు.