మనీష్ సిసోడియా అరెస్టయితే ? గుజరాత్ లో పెరుగుతున్న ఆప్ ఓట్లశాతం- కేజ్రివాల్ షాకింగ్
ఈ ఏడాది గుజరాత్ లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఆప్ కు ఢిల్లీలో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై కేంద్ర దర్యాప్తు సంస్ధల దాడులు వరంగా మారుతున్నాయా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఢిల్లీలో మద్యం కుంభకోణంపై సీబీఐ సిసోడియా ఇళ్లపై దాడులు నిర్వహిస్తోంది. త్వరలో ఆయన్ను అరెస్టు కూడా చేయబోతోందని సీఎం అరవింద్ కేజ్రివాల్ తాజాగా జోస్యం చెప్పారు.
ఢిల్లీ డిప్యూటీ సీఎం అయిన మనీష్ సిసోడియాపై మద్యం కుంభకోణం పేరుతో సీబీఐ జరుపుతున్న దాడుల వల్ల గుజరాత్ లో ఆప్ ఓట్లు 4 శాతం మేరకు పెరిగాయని సీఎం అరవింద్ కేజ్రివాల్ ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే క్రమంలో సిసోడియాను కేంద్ర దర్యాప్తు సంస్ధలు అరెస్టు చేస్తే మరో 6 శాతం ఓట్లు పెరిగే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. తద్వారా తమను కేంద్రం ఎంతగా టార్గెట్ చేస్తే గుజరాత్ తో తమ పార్టీ ఆప్ అంత పుంజుకోవడం ఖాయమనే సంకేతాల్ని ఆయన ఇచ్చారు.
ఢిల్లీలో ఆపరేషన్ కమలం విఫలమవుతుందని నిరూపించడానికి తాము ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని తీసుకువచ్చామని కేజ్రివాల్ తెలిపారు. తమ ఎమ్మెల్యేలు ఎవరూ పక్కకు మారలేదన్నారు. 62 మంది ఆప్ ఎమ్మెల్యేలలో 59 మంది విశ్వాస తీర్మానానికి హాజరయ్యారని, గైర్హాజరైన ముగ్గురిలో ఇద్దరు విదేశాల్లో ఉండగా, మూడో వ్యక్తి సత్యేందర్ జైన్ జైలులో ఉన్నారని కేజ్రివాల్ తెలిపారు. మొత్తంగా 58 మంది ఎమ్మెల్యేలు విశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారన్నారు. ఒకరు స్వయంగా స్పీకర్ అని తెలిపారు.