ఢిల్లీలో రాష్ట్రపతి పాలన కుట్ర: కేజ్రీవాల్ ఫైర్
న్యూఢిల్లీ: ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.
ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించేందుకు మునిసిపల్ పారిశుద్ద కార్మికుల సమ్మెను సాకుగా ఉపయోగించుకుంటున్నారని అన్నారు. బీజేపీ పాలిత మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన కార్మికులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.
మునిసిపల్ కార్మికులు తమ విధులు పక్కన పెట్టడంతో ఢిల్లీ నగరంలోని రోడ్లలో చెత్త పేరుకుపోయిందని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఆప్ మంత్రులే స్వయంగా రోడ్ల మీద ఉన్న చెత్త ఎత్తుతున్నారని, మంత్రి పదవులు పక్కన పెట్టి మునిసిపల్ కార్మికుల అవతారం ఎత్తారని గుర్తు చేశారు.
అరుణాచల్ ప్రదేశ్ లో మాదిరిగా ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించేందుకు మోడీ సర్కారు శక్తివంచన లేకుండా పని చేస్తున్నదని అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. బీజేపీ ఆధ్వర్యంలోని పలు శాఖలు అవినీతిలో కూరుకుపోయాయని, తమ ప్రభుత్వం మునిసిపల్ కార్మికులకు ఎలాంటి బాకీ లేదని, వారి జీతాలు తాము చెల్లిస్తున్నామని అరవింద్ కేజ్రీవాల్ వివరించారు.