'మోడీకి ముఖ్యమంత్రుల నుంచి ముప్పు ఉందా?'
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ పైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి విరుచుకుపడ్డారు. అంతర్రాష్ట్ర మండలి సమావేశంలో తనతో పాటు కొందరు ముఖ్యమంత్రులు మొబైల్ ఫోన్లు బయటే వదిలి వెళ్లవలసి వచ్చిందని ఆరోపించారు.
ముఖ్యమంత్రులతో మోడీకి ఏమైనా ముప్పు ఉందా అని ఆయన ప్రస్నించారు. ఆ ప్రశ్నే ఆయనను అడిగితే తన ప్రసంగానికి అడ్డంకులు ఎదురయ్యాయని చెప్పారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వంటి వారిని ఫోన్లతో సమావేశానికి అనుమతించారని, కానీ మాట్లాడినివ్వలేదని చెప్పారు.
ప్రతిపక్ష ముఖ్యమంత్రుల గళం వినిపించరాదని కేంద్రం భావించినట్లయితే తమను సమావేశానికి ఎందుకు ఆహ్వానించినట్లో చెప్పాలని ప్రశ్నించారు.
తొలుత తనను, మమతా బెనర్జీనీ మొబైల్ ఫోన్లతో అనుమతించలేదని చెప్పారు. దీనిపై మమత నిరసన తెలిపారని, దీంతో ఆమె ఫోన్తో లోపలకు వచ్చారన్నారు. పశ్చిమ బెంగాల్లో ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఆమెకు ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు.
అంతర్రాష్ట్ర మండలి సమావేసం ఈ నెల 16వ తేదీన జరిగిన విషయం తెలిసిందే. పదేళ్ల తర్వాత సమావేశం జరిగింది. దీనికి అన్ని రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా హాజరయ్యారు.