రసవత్తరంగా గుజరాత్ పోరు-తప్పుకుంటే మంత్రుల్ని వదిలేస్తాం-కేజ్రివాల్ కు బీజేపీ ఆఫర్?
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొంది. అధికార బీజేపీకి వ్యతిరేకంగా ఓవైపు కాంగ్రెస్, మరోవైపు ఆప్ మోహరించాయి. ఈ నేపథ్యంలో ఆప్ రాకతో తమకు ఇబ్బందులు తప్పవని భావిస్తున్న బీజేపీ ఆ పార్టీని అన్నివిధాలుగా టార్గెట్ చేస్తోంది. ఈ నేపధ్యంలో ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత కేజ్రివాల్ సంచలన ఆరోపణలు చేశారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పోటీ నుంచి ఆప్ తప్పుకుంటే ఢిల్లీలో కేంద్ర దర్యాప్తు సంస్ధలైన ఈడీ, సీబీఐ టార్గెట్ చేసిన ఆప్ మంత్రులు సత్యేందర్ జైన్, మనీష్ సిసోడియాను వదిలేస్తామంటూ బీజేపీ తనకు ఆఫర్ ఇచ్చినట్లు కేజ్రివాల్ ఆరోపించారు. బీజేపీలో చేరితో ఢిల్లీ సీఎం చేస్తామంటూ మనీష్ సిసిడియాకు ఇచ్చిన ఆఫర్ ఆయన తిరస్కరించిన తర్వాత వారు తనను సంప్రదించినట్లు కేజ్రివాల్ ఆరోపించారు. గుజరాత్ ఎన్నికల నుంచి ఆప్ పోటీచేయకుండా తప్పుకుంటే సత్యేందర్ జైన్, మనీష్ సిసోడియాపై అన్ని కేసుల్ని వెనక్కి తీసుకుంటామని బీజేపీ ఆఫర్ చేసినట్లు కేజ్రివాల్ తెలిపారు.
అయితే ఈ ఆఫర్ ఎవరికి ఇచ్చినట్లు అడిగితే తనకే నేరుగా ఇచ్చారని, కానీ ఎవరు ఇచ్చారన్నది బయటపెట్టలేనన్నారు. ఎందుకంటే బీజేపీ నేతలు నేరుగా ఏదీ చేయరని, వారి మిత్రులు, వారి మిత్రుల నుంచి ఓ సందేశం పంపిస్తారన్నారు. బీజేపీ ప్రస్తుత పరిస్ధితుల్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లోనూ ఓడిపోతోందని కేజ్రివాల్ జోస్యం చెప్పారు. గుజరాత్ లో ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని, కాంగ్రెస్ ఐదుసీట్లకే పరిమితమవుతుందని కేజ్రివాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.