పాకిస్తాన్ పత్రికల హెడ్లైన్లో కేజ్రీవాల్: బీజేపీ ఆగ్రహం
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పైన భారతీయ జనతా పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత ఆర్మీని తక్కువగా అంచనా వేసే మాటలు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెంటనే మానుకోవాలని కేంద్రమంత్రి, బిజెపి నేత రవిశంకర ప్రసాద్ అన్నారు.
సర్జికల్ దాడికి ఆధారాలను వెంటనే బయట పెట్టాలని కేజ్రీవాల్ అనడం దురదృష్టకరమన్నారు. ఆయన అలాంటి వ్యాఖ్యలు చేసినందు వల్ల నేడు పాకిస్తాన్ ప్రధాన వార్తల్లో నిలిచారని మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలను పాకిస్తాన్ సానుకూల అంశాంగా మార్చుకొని పతాక శీర్షికలు వెలువరించిందన్నారు.
భారత సైన్యాన్ని కించపరిచేలాగా కేజ్రీవాల్ ప్రకటనలు ఉన్నాయని మండిపడ్డారు. దయచేసి అలాంటి మాటలు మానుకోవాలని హితవు పలికారు. దేశ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా కేజ్రీవాల్ మాట్లాడారన్నారు. దేశ భద్రత పైన రాజకీయాలు చేయడం సరికాదన్నారు.
మిస్టర్ కేజ్రీవాల్.. మీరో విషయం తెలుసుకోవాలని, ఈ రోజు పాకిస్తాన్ మీడియాలో మీరే ప్రధాన శీర్షికలుగా ఉన్నారన్నారు. రాజకీయాలు వేరు, భారత సైన్యాన్ని కించపరిచేలా ఏం చేయకండని, ఏం మాట్లాడవద్దని సూచించారు. దాడులు చేయలేదన్న పాక్ చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రధాని మోడీ తిప్పికొట్టాలని, సర్జికల్ స్ట్రయిక్ ఫుటేజిని విడుదల చేయాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.