నిద్రలో పోలీసులు!: పోలీస్ స్టేషన్లోని ఏటిఎంలో చోరీ
న్యూఢిల్లీ: ఓ పోలీస్ స్టేషన్లోని పోలీసులందరూ నిద్రిస్తున్నారు. ఆ సమయంలో పోలీస్ స్టేషన్లో దొంగలు పడ్డారు. స్టేషన్ ఆవరణలో ఉన్న ఏటిఎంలోని డబ్బులు దోచుకెళ్లారు. ఈ సంచలన ఘటన జరిగింది ఎక్కడో కాదు దేశ రాజధాని ఢిల్లీలోని వసంత్ వీహార్లో. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉండటంతో ఆ ఏటిఎంలో భారీ మొత్తంలో నగదును బ్యాంకు సిబ్బంది పెట్టారని, ఆ తర్వాత దొంగలు పడి ఏటిఎంను ధ్వంసం చేసి డబ్బులు ఎత్తుకెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు.
అంతేగాక పోలీస్ స్టేషన్ ఆవరణలోని టీ షాపులో రూ. 5వేల నగదును కూడా ఎత్తుకెళ్లారు దొంగలు. అది పోలీస్ స్టేషన్ అని, అందులో పోలీసులు, ఎస్హెచ్ఓ ఉంటారని తెలిసీ కూడా దొంగలు ఈ ఘటనకు పాల్పడి ఉంటారంటే వాళ్ల ధైర్యం ఏమిటో తెలుస్తోంది.
కాగా, ఈ పోలీస్ స్టేషన్లోని ఇద్దరు పోలీసు అధికారులు రేప్, లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ కావడం గమనార్హం. అయితే దొంగతనం ఘటనపై ఉన్నతాధికారులు స్పందించడం లేదు. సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో స్టేషన్లో పోలీసు సిబ్బంది అంతా నిద్రలో ఉన్నారు.
కాగా, ఓ పోలీసు కానిస్టేబుల్ డబ్బు డ్రా చేసేందుకు ఆ ఏటిఎంలోకి వెళ్లినప్పుడు దొంగతనం జరిగిందన్న విషయం వారికి తెలిసింది. అయితే ఈ విషయం బయటికి వచ్చేది కాదు గానీ, టీ షాపు యజమాని తన నగదు డబ్బాలోని రూ. 5వేలు లేకపోవడంతో ఈ రెండు చోరీలు బయటపడ్డాయి.
డ్రగ్స్కు బానిసలైన వారే ఈ దొంగతనాలకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. అయితే వీరికి ఎవరైనా సహకరించారా? అన్న కోణంలోనూ విచారిస్తున్నారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న, ఏటిఎంలోని సిసిటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వేలిముద్రలను కూడా సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.