హస్తినలో కరోనా కేసుల తగ్గుముఖం.. ఆస్పత్రుల్లో బెడ్లు కూడా ఖాళీ
కరోనా వైరస్ కేసులు పెరగడమే కానీ తగ్గడం అంటూ ఉండటం లేదు. ముంబై, ఢిల్లీ గురించి అయితే చెప్పక్కర్లేదు. అయితే ఢిల్లీలో ఫస్ట్ టైమ్ కరోనా కేసుల తగ్గుముఖం కనిపించింది. అలాగే ఆస్పత్రిలో బెడ్లు అందుబాటులో ఉన్నాయనే విషయం తెలిసింది. పడకలే కాదు, ఐసీయూలో బెడ్లు కూడా ఉన్నాయనే సమాచారం తెలిసింది.
మొత్తం 14 వేల 805 బెడ్లలో 12 వేల 907 అందుబాటులోకి వచ్చాయి. గత కొన్నిరోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతుంది. మంగళవారం ఇక్కడ 4482 కరోనా కేసులు వచ్చాయి. ఏప్రిల్ 5వ తేదీ తర్వాత ఈ స్థాయిలో కేసులు రావడం ఇదే తొలిసారి. 265 మంది మాత్రమే చనిపోయారు. కరోనా కేసుల పాజిటివ్ శాతం కూడా 6.89 శాతం వరకు తగ్గిపోయింది.
ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులలో బెడ్లు ఖాళీగా ఉన్నాయని అధికారులు తెలిపారు. రికవరీ రేటు కూడా బాగా పెరిగిందని చెప్పారు. మంగళవారం 94.37 శాతం రికవరీ కనిపించిందని చెప్పారు. ఒక్కరోజులో 9403 మంది కోలుకున్నారు. ఇక్కడ 50 వేల 863 యాక్టివ్ కేసులు ఉన్నాయి.