బిహారీ దొంగల చేతివాటం.. ఒక్క రాత్రిలో 328 సంచుల ఉల్లిపాయలు చోరీ!
పాట్నా: దేశీయ మార్కెట్ లో ప్రస్తుతం ఉల్లిపాయల ధరలు ఏ రేంజ్ లో ఆకాశాన్ని అంటుతున్నాయో ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. ఉల్లి తరిగే టప్పుడు వచ్చే ఘాటు కంటే.. కొనడానికి చేసే ఖర్చే నషాళానికి అంటుతోంది. రెండువారాల కిందటి వరకూ కేజీ ఒక్కింటికి 15 నుంచి 20 రూపాయల వరకు పలికిన ఉల్లిపాయలు.. ప్రస్తుతం 80 రూపాయలకు చేరుకున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో వాటి ధరలు 100 రూపాయల ల్యాండ్ మార్క్ కు కాస్త అటూ, ఇటూగా ఊగిసలాడుతున్నాయి. ఉల్లిపాయల ధరలకు ఇప్పట్లో కళ్లెం పడే అవకాశాలు కూడా కనిపించట్లేదు. కారణం.. వాటి ధరలను నియంత్రించడానికి అటు కేంద్ర ప్రభుత్వం గానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు గానీ ఎలాంటి తక్షణ చర్యలను తీసుకోవట్లేదు గనక.
Recommended Video

328 గోనె సంచుల ఉల్లి పాయలు చోరీ..
ఈ పరిస్థితుల్లో ఉల్లి పాయలను చోరీ చేస్తే ఎలా ఉంటుంది? ఈ ఆలోచన వచ్చిందే తడవుగా ఆచరణలోకి పెట్టేశారు కొందరు బిహారీ దొంగలు. ఉన్నఫళంగా చోరీకి పాల్పడ్డారు. అందుబాటులో ఉన్న ఓ ఉల్లి పాయల గిడ్డంగిపై గుట్టు చప్పుడు కాకుండా దాడికి దిగారు. వంద కాదు.. రెండు వందలూ కాదు. ఏకంగా 328 గోనెసంచుల్లో నిల్వ ఉంచిన ఉల్లి పాయలను చోరీ చేసేశారు. దీనికోసం దొంగలు మూడు మినీ ట్రక్కులను వెంట తెచ్చుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ ఘటన చోటు చేసుకుని మూడురోజులైనప్పటికీ.. పోలీసులు మాత్రం ఇంకా ఆ ట్రక్కుల జాడ గానీ, మాయమైన ఉల్లిపాలయ సంచులను ఆచూకీని గానీ పట్టుకోలేకపోయారు. వారి వెదుకులాట ఇంకా కొనసాగుతూనే ఉంది.

రూ.18 లక్షలు విలువ చేసే ఉల్లి..
బిహార్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. బిహార్ రాజధాని పాట్నా నగర శివార్లలోని సొనారూ ప్రాంతంలో పెద్ద ఎత్తున గిడ్డంగులు ఉన్నాయి. నానాటికీ ఉల్లి పాయల ధరలు ఆకాశానికి అంటుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఉల్లి రైతులు పెద్ద ఎత్తున ఆ గిడ్డంగుల్లో తమ పంట ఉత్పత్తులను భద్రపరచుకున్నారు. రేటు మరింత పెరిగిన తరువాత మార్కెట్ లో అమ్ముకోవచ్చనేది వారి ఆలోచన. వారి ఆశలపై నీళ్లు చల్లుతూ, వారి అంచనాలను పటాపంచలు చేస్తూ కొందరు దొంగలు రంగంలోకి దిగారు. ఉల్లిపాయలను నింపిన గోనె సంచులను పెద్ద సంఖ్యలో నిల్వ ఉంచిన గిడ్డంగిలో చోరీకి పాల్పడ్డారు. మూడో కంటికి తెలియకుండా 328 సంచులను మాయం చేశారు. వాటి విలువ మార్కెెట్ లో 16 లక్షల నుంచి 18 లక్షల రూపాయల వరకు ఉంటుందని రైతులు బావురు మంటున్నారు.

మహారాష్ట్ర నుంచి కూడా తెప్పించారట..
తన గిడ్డింగిలో చోరీ చోటు చేసుకున్న విషయం తెలిసిన వెంటనే యజమాని ధీరజ్ కుమార్ ఫతూహా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు నమోదు చేసుకున్న వెంటనే పోలీసులు గిడ్డంగిని పరీశీలించారు. టైరు గుర్తుల ఆధారంగా దొంగలను గోనె సంచులను తరలించడానికి మినీ ట్రక్కులను వినియోగించి ఉంటారని అనుమానించారు. స్థానికంగా పండిన వాటితో పాటు మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ నుంచి కూడా ఉల్లిపాయలను కొనుగోలు చేసినట్లు ధీరజ్ కుమార్ తెలిపారు. మరి కొన్ని సంచులను రోజువారీ అద్దె రూపంలో రైతులు గిడ్డింగిలో దాచుకున్నట్లు చెప్పారు. అవన్నీ మాయం అయ్యాయని, ఉల్లి పాయలతో పాటు క్యాష్ కౌంటర్ లో ఉంచిన 1,83,000 రూపాయల నగదు కూడా కనిపించట్లేదని ధీరజ్ కుమార్ తన ఫిర్యాదులో నమోదు చేశారు. 328 సంచులను ఒక్క రాత్రిలో మాయం చేయడమంటే మాటలు కాదని పోలీసులు అనుమానిస్తున్నారు. కనీసం ఎనిమిది మంది వాటిని ట్రక్కుల్లో లోడ్ చేసి ఉండొచ్చని చెబుతున్నారు. ఈ కేసును ఛేదించడానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు పోలీసులు. రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications