ప్రమాదపు అంచున.. మెడికల్ వ్యవస్థపై విపరీతమైన ఒత్తిడి.. భారత్లో ఇదీ పరిస్థితి..
నిపుణులు,పరిశీలకులు అంచనా వేసినట్టుగానే భారత్లో జూన్,జులై నెలల్లో కరోనా పీక్స్కి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కరోనా కేసుల్లో ప్రపంచవ్యాప్తంగా ఐదో స్థానంలో ఉన్న భారత్లో కేసులు విజృంభిస్తున్నాయి. త్వరలోనే మూడో స్థానంలో ఉన్న బ్రిటన్ను కూడా భారత్ దాటేసే అవకాశం లేకపోలేదు. దేశవ్యాప్తంగా దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోనూ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో మెడికల్,హెల్త్ కేర్ వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. ముఖ్యంగా కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్న ముంబై,ఢిల్లీ,తమిళనాడుల్లో ఇప్పటికే ఆసుపత్రుల్లో బెడ్ల కొరత ఏర్పడిందన్న కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేసుల సంఖ్య పీక్స్కి చేరుకుంటే దేశ మెడికల్,హెల్త్ కేర్ వ్యవస్థ తట్టుకోగలదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

వరదరాజన్ వీడియో..
తమిళ నటుడు,మాజీ న్యూస్ రీడర్ వరదరాజన్ వీడియో ఒకటి ఇటీవల వైరల్ అయింది. చెన్నై ఆసుపత్రుల్లో కరోనా పేషెంట్లకు బెడ్ల కొరత ఉందని అందులో వరదరాజన్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఇటీవల కరోనా అనుమానిత లక్షణాలు బయటపడ్డ తన మిత్రుడి ఆవేదనను పంచుకున్నారు. తీవ్ర శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న అతనికి.. చెన్నై ఆసుపత్రుల్లో ఎక్కడా బెడ్ దొరకని పరిస్థితి నెలకొందన్నారు. అతని కుటుంబం చాలా ఆస్పత్రులను సంప్రదించగా.. ఎక్కడా బెడ్స్ ఖాళీ లేవనే సమాధానమే వినిపించిందన్నారు. కొంతమంది సీనియర్ అధికారులను సంప్రదించినా తన మిత్రుడికి ఏ ఆసుపత్రిలోనూ బెడ్ దొరకలేదని వాపోయారు.

వరదరాజన్పై ఎఫ్ఐఆర్ నమోదు..
తమిళనాడులో కరోనా పరిస్థితులు,మెడికల్ వ్యవస్థపై వదంతులు ప్రచారం చేస్తే కఠిన శిక్షలు తప్పవని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సి.విజయ భాస్కర్ హెచ్చరించిన మరుసటిరోజే వరదరాజన్ ఈ ఆరోపణలు చేయడం గమనార్హం. చెన్నై ఆసుపత్రుల్లో బెడ్స్ కొరత ఉందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై ఎఫ్ఐఆర్ నమోదైంది. వరదరాజన్ ఆరోపణలను మంత్రి విజయ భాస్కర్ కొట్టిపారేశారు. తమిళనాడువ్యాప్తంగా మొత్తం 75వేల పడకలను కరోనా పేషెంట్ల కోసం అందుబాటులోకి తీసుకొచ్చామని.. ఒక్క చెన్నైలోనే 5వేల పడకలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.

అప్రమత్తం చేసేందుకే వీడియో చేశానన్న వరదరాజన్..
వరదరాజన్ ఆరోపణలపై డైరెక్టర్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్&పబ్లిక్ హెల్త్ తేన్యాంపేట్ సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సెక్షన్ 153,505,188 సెక్షన్ల కింద ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేసు నమోదుపై స్పందించిన వరదరాజన్.. తాను చేసిన వీడియో వైరల్ అవుతుందని ఊహించలేదన్నారు. కేవలం 25 మంది ఉన్న తమ థియేటర్ గ్రూపుతో ఈ వీడియోను పంచుకున్నట్టు చెప్పారు. కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా వ్యవహరించమని చెప్పేందుకే వీడియో విడుదల చేసినట్టు చెప్పారు. అంతేకాదు,కరోనా నియంత్రణకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషిని ఆయన మెచ్చుకున్నారు.
ఇటలీ లాంటి స్థితే చెన్నై,ఢిల్లీలోనూ : కస్తూరి శంకర్
వరదరాజన్ వీడియోను నటి కస్తూరి శంకర్ కూడా ట్విట్టర్లో షేర్ చేశారు. వరదరాజన్ ఒక్కరే కాదు.. చాలామంది నుంచి ఇలాంటి కథనాలే వినిపిస్తున్నాయని తన ట్వీట్లో పేర్కొన్నారు. 'వీఐపీ,రిచ్.. అన్నదానితో సంబంధం లేదు. ఎక్కడా బెడ్స్ ఖాళీ లేవు. చెన్నైలో ఇప్పటికీ బెడ్స్ కొరత ఉంది. జనరల్ ఆసుపత్రితో పాటు అన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ కరోనా వార్డులు పేషెంట్లతో నిండిపోయాయి.ఒకరకంగా గత మార్చి నెలలో ఇటలీ ఎలాంటి పరిస్థితిని చవిచూసిందో ఇప్పుడు చెన్నై కూడా అలాంటి స్థితినే చూస్తోంది. ఢిల్లీది కూడా అదే కథ.' అంటూ ఆమె పేర్కొన్నారు.

ఢిల్లీ ఆసుపత్రులు ఢిల్లీ వాసులకే..
రోజురోజుకు పెరుగుతున్న కేసులతో ఆస్పత్రులపై ఒత్తిడి తీవ్రమవుతుండటంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇటీవలే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలోని కరోనా ఆస్పత్రులు ఢిల్లీ వాసులకు మాత్రమే అందుబాటులో ఉంటాయని ప్రకటించారు. కేవలం ఢిల్లీ వాసులకు మాత్రమే అక్కడ చికిత్స అందిస్తామని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేట్ ఆస్పత్రులు కూడా ఢిల్లీ వాసుల కోసం రిజర్వ్ చేయబడ్డాయని చెప్పారు. జూన్ చివరి నాటికి ఢిల్లీలో 15వేల పడకలు అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో ఇతర రాష్ట్రాల వారికి కూడా అవకాశం ఇస్తే.. 9వేల పడకలు మూడు రోజుల్లోనే నిండిపోతాయని పేర్కొంది. కాబట్టే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఆస్పత్రులు మినహా మిగతా వాటిని ఢిల్లీ వాసుల కోసమే రిజర్వ్ చేస్తున్నట్టు తెలిపింది.

ముంబైలోనూ బెడ్ల కొరత..
ముంబైలోనూ పరిస్థితి ఇలాగే ఉంది. ఇప్పటికే ముంబైలో 50వేల కేసులు దాటగా.. ఆస్పత్రుల్లో బెడ్ల కొరత తీవ్రంగా ఉందని చాలామంది నెటిజన్స్ సోషల్ మీడియాలో వాపోతున్నారు. ఇప్పటికే క్రిటికల్ కేర్ యూనిట్లలోని 90శాతం బెడ్స్ నిండిపోయాయి. కరోనా పేషెంట్ల కోసం మొత్తం 9092 బెడ్లను అందుబాటులోకి తీసుకురాగా.. ఇందులో 8570 బెడ్లు నిండిపోయాయి. ఐసీయూ వార్డుల్లోని 1097 బెడ్లలో 94శాతం బెడ్లు నిండిపోయాయి.ముంబైలో మొత్తం 442 వెంటిలేటర్లు మాత్రమే అందుబాటులో ఉండగా.. ఇందులో 378 వెంటిలేటర్లపై ప్రస్తుతం పేషెంట్లకు చికిత్స అందిస్తున్నారు. మొత్తం మీద ఢిల్లీ,చెన్నై,ముంబై వంటి ప్రధాన నగరాల్లో ఓవైపు కరోనా కేసులు విజృంభిస్తుండటం.. మరోవైపు ఆస్పత్రులు చాలకపోవడం భారత్ను తీవ్రంగా కలవరపరుస్తోంది.












Click it and Unblock the Notifications