‘చేతిలో నవజాత శిశువున్నట్లు..’: చంద్రయాన్ 2 ల్యాండింగ్పై ఇస్రో ఛైర్మన్ ఏమన్నారంటే?
బెంగళూరు: భారత ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అయిన చంద్రయాన్ 2లో శనివారం తెల్లవారుజామున 1.30-2.30గంటల మధ్య కాలంలో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై అడుగుపెట్టనుంది. విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై అడుగుపెట్టే ముందు ఉన్న 15 నిమిషాలే చాలా భయంకరమైనవని ఇస్రో శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
Recommended Video
ఈ సందర్భంగా ఇస్రో ఛైర్మన్ డా. కే శివన్ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. 'ఎవరైనా వచ్చి మీ చేతిలో ఓ నవజాత శిశువును పెడితే ఎలా ఉంటుంది? ఇప్పుడు మా పరిస్థితి అలాగే ఉంది. ల్యాండ్ అవడానికి కేవలం 35 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఎలాంటి గాయం కాకుండా ల్యాండర్, రోవర్ చంద్రుడిపై దిగాల్సి ఉంది. చంద్రుడిపై దిగే ఆ 15 నిమిషాలే చాలా భయానకమైనవి' అని చెప్పారు.
'ఇది(చంద్రుడిపై ల్యాండర్, రోవర్ దిగడం) చాలా చాలా క్లిష్టమైన పక్రియ. చంద్రుడిపై ల్యాండర్, రోవర్ విజయవంతంగా దిగేందుకు మానవ ప్రయత్నంగా అన్ని ఏర్పాటు చేశాం. ఇక ఆ 15 నిమిషాలే మమ్మల్ని కొంత భయానికి గురిచేస్తున్నాయి' అని శివన్ తెలిపారు.
చంద్రయాన్ 2 రేపే ల్యాండింగ్: ఆ 15 నిమిషాలే భయానకం, ఆ తర్వాతే పని ప్రారంభం, కీలక ఘట్టాలివే..
మూన్ ల్యాండర్ విక్రమ్ ఇప్పటి కక్ష్య నుంచి విడిపోయి చంద్రుడికి దగ్గరగా వెళుతోంది. శనివారం తెల్లవారుజామున 1.30-2.30 మధ్య సమయంలో చంద్రుడిపై ఈ ల్యాండర్ దిగనుంది. కాగా, బెంగళూరులోని ఇస్రో ప్రధాన కేంద్రం నుంచి ప్రధాని నరేంద్ర మోడీ, ఇస్రో ఎంపిక చేసిన 60మంది విద్యార్థులు చంద్రుడిపై ల్యాండర్, రోవర్ దిగడాన్ని ప్రత్యక్షంగా వీక్షించనున్నారు
జులై 22న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీహరి కోట నుంచి ఇస్రో చంద్రయాన్ 2ను నింగిలోకి పంపింది. కేవలం రూ. వెయ్యి కోట్ల ఖర్చుతోనే చంద్రయాన్ 2ను రూపొందించారు. ఇతర దేశాలు రూపొందించిన మిషన్లతోపాటు పోలిస్తే ఇది చాలా తక్కువ ఖర్చు కావడం గమనార్హం.