నిర్భయకు న్యాయం కోసం ఏడేళ్ల పోరాటం: ఎవరా మహిళా న్యాయవాది: పైసా ఫీజు తీసుకోకుండా.. !
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో పారామెడికల్ విద్యార్థిని నిర్భయపై అత్యంత క్రూరంగా సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో నలుగురు దోషులు ఎట్టకేలకు ఉరికంబాన్ని ఎక్కారు. ఉరికొయ్యకు వేలాడారు. ఈ కేసులో దోషులుగా తేలిన ముఖేష్ కుమార్ సింగ్, అక్షయ్ కుమార్ సింగ్, పవన్ గుప్తా, వినయ్ శర్మలకు విధించిన ఉరిశిక్షను శుక్రవారం తెల్లవారు జామున అమలు చేశారు. న్యూఢిల్లీలోని షహీద్ భగత్సింగ్ మార్గ్లో గల తీహార్ కేంద్ర కారాగారంలో ఈ నలుగురినీ ఏకకాలంలో ఉరి తీశారు.
ఆశాదేవి వెన్నంటి ఉంటూ..
ఈ కేసు విషయంలో నిర్భయ కుటుంబానికి అండగా ఉంటూ, వారి తరఫున న్యాయస్థానాల్లో పోరాడిన మహిళా న్యాయవాది పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమౌతోంది. చట్టంలో ఉన్నట్లుగా చెబుతోన్న లొసుగులను అడ్డుగా పెట్టుకుని తమ చావును కూడా ఎప్పటికప్పుడు వాయిదా వేసుకుంటూ వచ్చిన దోషులకు ఉరికంబం ఎక్కేంత వరకూ వదల్లేదా మహిళా న్యాయవాది. నిర్భయ తల్లి ఆశాదేవికి వెన్నంటి ఉంటూ.. అనుక్షణం ఆమెకు ధైర్యాన్ని ఇస్తూ చట్టంతో పోరాటాన్ని సాగించారు. ఆమే- సీమా ఖుష్వాహ.
కేసు ఆరంభం నుంచీ చివరి దాకా..
నిర్భయపై అత్యాచారం జరిగిన అనంతరం చోటు చేసుకున్న పరిణామాల ఆరంభం నుంచీ సీమా ఖుష్వాహా ఆశాదేవి కుటుంబానికి అండగా ఉంటూ వచ్చారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, దోషులపై ఛార్జిషీట్ నమోదు చేయించడం మొదలుకుని ఈ కేసుకు సంబంధించిన ప్రతి విషయంలోనూ సీమా ఖుష్వాహ ముద్ర అడుగడుగునా కనిపిస్తుంది. పటియాలా హౌస్ న్యాయస్థానం, ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టులో ఈ కేసు మీద ఆమె ఆశాదేవి తరఫున వాదనలను సమర్థవంతంగా వినిపించారు. ఈ కేసులో సీమా.. ఒక్క రూపాయి కూడా ఫీజుగా తీసుకోలేదు. తన స్నేహితురాలికి న్యాయం చేస్తున్నాననే ఉద్దేశంతోనే పోరాడానని సీమా చెప్పారు.
ఆలస్యమైందే తప్ప.. తప్పించుకోలేదు..
ఉత్తర ప్రదేశ్కు చెందిన సీమా ఖుష్వాహా అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ సభ్యురాలు. అయినప్పటికీ.. ఈ కేసులో సుప్రీంకోర్టు వరకూ వెళ్లగలిగారు. ఉరిశిక్ష నుంచి తప్పించుకోవడానికి దోషులు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. తమ మరణాన్ని ఆలస్యం చేసుకోగలిగారే తప్ప.. తప్పించుకోలేరని సీమా ముందు నుంచీ చెబుతూనే ఉన్నారు. చివరికి- దోషులను ఉరితీయడం పట్ల ఆమె తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
Recommended Video
జీవితాంతం గుర్తిండిపోయేలా..
ఈ కేసు విచారణ తనకు జీవితాంతం గుర్తుండి పోతుందని సీమా వ్యాఖ్యానించారు. చట్టంలో ఉన్న లోపాలేమిటో కూడా తాను అనుభవపూరకంగా తెలుసుకోగలిగానని అన్నారు. చట్టంలో లోపాలు ఉండటం వల్లే వారు మూడుసార్లు డెత్ వారెంట్ల నుంచి తప్పించుకోగలిగారని అభిప్రాయపడ్డారు. నిర్భయకు, ఆమె కుటంబానికి న్యాయం అందించానని సంతృప్తి తనకు మిగిలిందని అన్నారు. ఈ ఏడేళ్ల కాలంలో ఆశాదేవి కుటుంబంతో తనకు సన్నిహితం ఏర్పడిందని, ఆమె తనను కన్న కుమార్తెగా చూసుకున్నారని సీమా సంతోషాన్ని వ్యక్తం చేశారు.