యూపీ పోరులో బీజేపీకి చుక్కలు-లఖీంపూర్ తో సిక్కులు, బ్రహ్మణులకుదూరం-ఆశిష్ పై వ్యతిరేకత
వచ్చే ఏడాది మార్చిలో జరిగే యూపీ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్న బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా పెట్రో ధరల్ని కూడా తగ్గించేసింది. 2024 సార్వత్రిక ఎన్నికలకు వీటిని సెమీ ఫైనల్స్ గా భావిస్తూ గెలుపు కోసం వ్యూహరచన చేస్తున్న కాషాయ సేనకు ఇప్పుడు లఖీంపూర్ ఖేరీలో రైతులపై దాష్టీకం చుక్కలు చూపిస్తోంది. ఈ ఒక్క ఘటన కారణంగా ఇప్పుడు సిక్కులు, బ్రహ్మణులకు దూరం పెరగడంతో పాటు యూపీ ఎన్నికలపై పుట్టి ముంచే అవకాశాలూ కనిపిస్తున్నాయి.
యూపీ ఎన్నికల్లో బీజేపీకి చుక్కలు
యూపీలో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలు బీజేపీ ప్రతిష్టకు సవాల్ గా మారిపోతున్నాయి. అసలే గతంలో ఏకపక్షంగా ఇక్కడ విజయబావుటా ఎగురవేసిన బీజేపీకి ఈసారి ఎన్నికల్లో మాత్రం అన్నీ ప్రతికూల పరిస్ధితులే ఎదురవుతున్నాయి. ముఖ్యంగా యోగీ ఆదిత్యనాథ్ సర్కార్ ఈ ఐదేళ్లలో తీసుకున్న పలు వివాదాస్పద నిర్ణయాలు, ప్రజల్ని అణచివేసిన తీరు ఇప్పుడు బీజేపీకి శాపంగా మారుతోంది. దీంతో ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. అసలే కుల సమీకరణాలు, మత సమీకరణాలు ఎక్కువగా ఉండే రాష్ట్రం కూడా కావడంతో అక్కడ ప్రత్యేక వ్యూహాలు రచించాల్సి వస్తోంది. ఇలాంటి సమయంలోనే లఖీంపూర్ ఖేరీ ఘటన తీవ్ర ప్రభావం చూపుతోంది.
లఖీంపూర్ ఘటనతో
యూపీలోని లఖీంపూర్ ఖేరీలో రెండు నెలల క్రితం వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులపైకి కేంద్రంమత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా తన కారు పోనిచ్చాడు. దీంతో నలుగురు రైతులు అక్కడే చనిపోయారు. ఆ తర్వాత ఘర్షణల్లో మరో నలుగురు రైతుల్ని పోలీసులు కాల్చి చంపారు. ఈ వివాదం పార్లమెంటును, సుప్రీంకోర్టును సైతం తాకింది. దీంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇప్పుడు అదే ఘటన యూపీలోని ఈ ప్రాంతంలో బీజేపీ అవకాశాల్ని సైతం ప్రభావితం చేసే ప్రమాదం కనిపిస్తోంది.
ఆశిష్ మిశ్రాపై బీజేపీ అసంతృప్తి
లఖీంపూర్ ఖేరీ ఘటనలో అనవసరంగా రైతులతో వాగ్వాదానికి వెళ్లి వారిపై కారు పోనిచ్చి నలుగురు రైతుల మరణానికి కారకుడైన ఆశిష్ మిశ్రా ఇప్పుడు కోర్టు కేసులు ఎదుర్కొంటున్నాడు. అదే సమయంలో ఆయన తండ్రి, కేంద్ర జూనియర్ హోంమంత్రి అజయ్ మిశ్రాకూ చిక్కులు తప్పడం లేదు. దీంతో పాటు ఆశిష్ మిశ్రా వ్యవహారంలో బీజేపీ కూడా స్ధానికంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ వ్యవహారంలో ఆశిష్ మిశ్రా పాత్ర ఉందని తేలడంతో స్ధానికంగా బీజేపీపై వ్యతిరేకత పెరుగుతోంది. దీంతో బీజేపీలోనూ ఆశిష్ మిశ్రాపై అసంతృప్తి పెరుగుతోంది. అయితే వెంటనే ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు కనిపించడం లేదు.
Recommended Video
సిక్కులు, బ్రహ్మణులకూ పెరిగిన దూరం
యూపీలో చోటు చేసుకున్న లఖీంపూర్ ఖేరీ ఘటనలో నలుగురు సిక్కు రైతులు చనిపోయారు. ఈ ఘటనకు కారకుడైన ఆశిషా మిశ్రా బ్రహ్మణుడు కావడంతో సిక్కులపై ఉద్దేశపూర్వకంగానే దాడి చేసి వారి మరణానికి కారణమైనట్లు వారిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీంతో బీజేపీకి స్ధానిక ఓటు బ్యాంకుగా ఉన్న బ్రహ్మణులు, సిక్కుల మధ్య గ్యాప్ పెరిగిపోయింది. ఇప్పుడు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో దీని ప్రభావం వారిపై పడేలా కనిపిస్తోంది. ముఖ్యంగా లఖీంపూర్, పిల్ భిత్ జిల్లాల పరిధిలో సిక్కులు, బ్రహ్మణులకు పెరిగిన దూరం బీజేపీ పుట్టి ముంచేలా ఉంది. ఈ రెండు జిల్లాల పరిధిలో 12 అసెంబ్లీ సీట్లతో పాటు మూడు లోక్ సభ స్ధానాలున్నాయి. అందుకే సిక్కులపై దాడి ఘటనను సైతం పిలిభిత్ ఎంపీగా ఉన్న వరుణ్ గాంధీ కూడా సీరియస్ గా తీసుకుని బీజేపీ ఆగ్రహానికి గురయ్యారు.