కుల రాజకీయాల కోసం రాష్ట్రపతిగా కోవింద్ ఎంపిక : గెహ్లట్ నోటి దురుసు, క్షమాపణకు బీజేపీ డిమాండ్
న్యూఢిల్లీ : ఎన్నికల వేళ సీనియర్ కాంగ్రెస్ నేత, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లట్ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. కోవింద్ను రాష్ట్రపతి అభ్యర్థిగా కులం ఆధారంగా ఎన్డీఏ సర్కార్ ఎంపిక చేసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. గెహ్లట్ వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. కాంగ్రెస్ పార్టీ దళిత వ్యతిరేక, పేదల వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక విధానాలని మరోసారి రుజువయ్యాయని విరుచుకుపడింది.
కారణమిదేనా ?
2017లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తిరిగి అధికారం చేపట్టడం ఎలా అని బీజేపీ ఆలోచించిందని గెహ్లట్ ఆరోపించారు. ఇందుకోసం దళిత కార్డును ఎరగా వేసి కోవింద్ను ఎంపికచేసిందని పేర్కొన్నారు. రాష్ట్రపతి అభ్యర్థిత్వంతో విజయం సాధించొచ్చని ఆ ఆలోచన చేసిందని గుర్తుచేశారు. ఆ సమయంలో గుజరాత్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడే అవకాశం లేదని చెప్పారు. అప్పుడు బీజేపీ చీఫ్ అమిత్ షా .. కోవింద్ పేరును తెరపైకి తీసుకొచ్చారని తెలిపారు. దీంతో అప్పటివరకు కనీసం రాష్ట్రపతి అవుదామని అనుకొన్న అద్వానీ పేరు తెరమరగైందని తెలిపారు. భరతజాతి కూడా అద్వానీ రాష్ట్రపతి అవుతారని భావించిందని గుర్తుచేశారు.
చిన్నచూపేనా ?
గెహ్లట్ వ్యాఖ్యలను బీజేపీ తప్పుపట్టింది. 'అణగారిన వర్గాల నుంచి అత్యున్నత శిఖరాలకు ఒకరు చేరితే కాంగ్రెస్ పార్టీకి నచ్చుదు అని బీజేపీ విమర్శించింది. కానీ కోవింద్ .. దళిత కుటుంబం నుంచి వచ్చి అత్యుత్తమ స్థాయికి ఎదిగిన వ్యక్తి అని కీర్తంచింది. గెహ్లట్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ... కోవింద్పై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని బీజేపీ నేత జీవీఎల్ నరసింహరావు డిమాండ్ చేశారు.
నష్ట నివారణ చర్యలు
గెహ్లట్ వ్యాఖ్యలతో బీజేపీ తీవ్రంగా ప్రతిస్పందించడంతో ... రాజస్థాన్ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. కోవింద్పై గెహ్లట్ చేసిన వ్యాఖ్యలు ఆయన సొంత అభిప్రాయం కాదని .. రాజస్థాన్ సీఎం కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి. ఓ ఆర్టికల్ వచ్చిన అభిప్రాయాన్ని మాత్రమే గెహ్లట్ షేర్ చేశారని స్పష్టంచేసింది. ఇదిలాఉంటే మరోవైపు కోవింద్ రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై విపక్ష నేతలు కూడా పెదవి విరిచారు. కోవింద్ రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ప్రతిపాదించడం ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ. అంతేకాదు కోవింద్ .. రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి సరిపోరని, ఆయన కంటే మేధావులైన దళిత నేతలు దేశంలో చాలామంది ఉన్నారని అప్పుడే స్పందించారు దీదీ.