సోనియాకు షాక్: అస్సాం సిఎం గోగోయ్ రాజీనామా
న్యూఢిల్లీ: అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గోగోయ్ రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆయన రేపు గురువారం రాజీనామా చేయనున్నారు. లోకసభ ఎన్నికల్లో అస్సాంలో కాంగ్రెసు పార్టీ తగిన ఫలితాలు సాధించడంలో విఫలమైనందుకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. తన రాజీనామా లేఖను ఆయన కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి సమర్పిస్తారు .
సోనియాను కలిసి రాజీనామా లేఖను సమర్పించి, తన భవిష్యత్తను నిర్దేశించాలని కోరడానికి ఆయన మంగళవారంనాడే ఢిల్లీ వచ్చారు. లోకసభ ఎన్నికల్లో ఫలితాలు సాధించడంలో విఫలమైన నేపథ్యంలో గోగోయ్ని మార్చాలనే డిమాండ్ మరోసారి పెచ్చరిల్లింది.
అస్సాంలో కాంగ్రెసు కేవలం మూడు సీట్లను మాత్రమే గెలుచుకుంది. నాయకత్వ మార్పునకు తిరుగుబాటు మంత్రులు, శాసనసభ్యులు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దాన్ని ఎదుర్కోవడానికి కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలని తరుణ్ గోగోయ్ అనుకూల వర్గం సూచిస్తోంది.
మంత్రుల నుంచి రాజీనామాలు తీసుకుని, కొత్తవారితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలని వారంటున్నారు. 2016 శానససభ ఎన్నికలకు ముందే కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలని వారంటున్నారు.