కరుడుగట్టిన కారు దొంగల ముఠాతో సంబంధాలు: లేడీ ఎమ్మెల్యే అరెస్ట్
గౌహతి: దేశ వ్యాప్తంగా కారు దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాతో సంబంధముందని తేలడంతో అస్సాం కాంగ్రెస్ ఎమ్మెల్యే రూమీనాథ్ను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఢిల్లీ, ముంబై కేంద్రంగా కారు, వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న అనిల్ చౌహన్ ముఠాతో ఆమెకు సంబంధాలున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
ఇటీవల అనిల్ చౌహాన్ను అరెస్ట్ చేసిన పోలీసుల విచారణలో రూమీనాథ్ అతనికి సహకరించినట్లు నిర్ధారణ అయింది. రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలో కార్ల పాస్లను ఇచ్చి అనిల్ చౌహన్కు సహకరించినట్లు పోలీసులు విచారణలో తేల్చారు. ఆమెపై ఆరోపణలు వచ్చిన నాటి నుంచి నిఘా పెట్టిన పోలీసులు, మంగళవారం ఆమెను అరెస్ట్ చేశారు.
కాగా, కార్ల దొంగతనాల ముఠాతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు రావడంతో కాంగ్రెస్ పార్టీ కూడా ఆమెకు షోకాజు నోటీసులు జారీ చేసింది. కట్టుదిట్టమైన భద్రత ఉన్న అసెంబ్లీ ప్రాంగణంలోకి వచ్చేందుకు పాసులను ఒక దొంగకు ఎలా జారీ చేశారని అసెంబ్లీ సెక్రటేరియట్ ఆమెను ప్రశ్నిస్తూ ఓ లేఖను పంపింది.
మే 2013, సెప్టెంబర్ 2014, 2015 జనవరిలో రూమీనాథ్.. అనిల్ చౌహన్కు కారు పాస్లను ఇవ్వడంపై అసెంబ్లీ సెక్రటేరియట్ వివరణ కోరింది. నిబంధనల ప్రకారం ఎమ్మెల్యే లేదా మంత్రి తనకు సంబంధించిన అన్ని వాహనాలకు పాస్ లను పొందవచ్చు. అలాగే ఎమ్మెల్యే లేదా మంత్రి తన బంధువులు, స్నేహితుల వాహనాలైతే ఐదు వాహనాల వరకు పాసులను పొందవచ్చు.

కాగా, ఒక పేరుమోసిన దొంగ అనిల్ చౌహాన్ కోసం ప్రజాప్రతినిధిగా ఉన్న రూమీనాథ్ పాసులను ఇవ్వడంపై అసెంబ్లీ సెక్రటేరియట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ఇలా ఉండగా దేశంలో దాదాపు 3000లకు పైగా కార్ల దొంగతనాలతో సంబంధమున్న అనిల్ చౌహాన్.. 2010ఆగస్టులో మేఘాలయలో అరెస్టయ్యాడు. ఆ తర్వాత బయటికొచ్చాడు.
సీఆర్పీఎఫ్ పోలీసులతో జాయింట్ ఆపరేషన్ నిర్వహించిన గౌహతి పోలీసులు ఏప్రిల్ 7న అజారా ప్రాంతం సమీపంలో అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి ఒక పిస్టల్, ఒక 9ఎంఎం పిస్టల్, 4 మొబైల్ ఫోన్లు, ఏటిఎంలు, కొంత మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. న్యూఢిల్లీ, ముంబై, కోల్కతా, షిల్లాంగ్, మహారాష్ట్ర తోపాటు తదితర ప్రాంతాల్లో అతనికి నెట్వర్క్ ఉందని పోలీసులు తెలిపారు.
2006 ఎన్నికల్లో బార్ఖోలా నియోజకవర్గం నుంచి బిజెపి టికెట్పై గెలిచిన రూమీనాథ్.. ఆ తర్వాత 2010లో కాంగ్రెస్ పార్టీలో చేరి 2011లో జరిగిన ఎన్నికల్లో మళ్లీ ఎమ్మెల్యేగా గెలుపొందింది. వైద్యుడైన తన భర్తను, రెండేళ్ల కూతురును విడిచిపెట్టిన రూమీనాథ్.. మతం మార్చుకుని జాకీ జకీర్ అనే ఓ ఎమ్మెల్యేను వివాహం చేసుకుంది. దీంతో ఆమె తొలిసారిగా వార్తల్లోకెక్కారు. ఆ తర్వాత తనను తన భర్త జకీర్ చిత్ర హింసలకు గురి చేస్తున్నాడని ఫిర్యాదు చేసింది. దీంతో జకీర్ను పోలీసులు అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications