అస్సోం జాతీయ పౌరుల పట్టిక విడుదల:40 లక్షల మందికి దక్కని పౌరసత్వం
Recommended Video
అస్సోం: అస్సోంలో జాతీయ పౌరుల పట్టికను అధికారులు విడుదల చేశారు. సోమవారం గౌహతిలో ఈ పట్టికను రిలీజ్ చేశారు. ఇందులో అస్సాంకు చెందిన 40 లక్షల మంది పౌరులకు ఆరాష్ట్ర పౌరసత్వం దక్కలేదు. మొత్తం 3.29 కోట్ల మంది ప్రజల్లో 40 లక్షల మంది పేర్లు తుది జాబితాలో కనిపించకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. అయితే జాబితాలో లేని పేర్లు గల వ్యక్తులను విదేశీయులుగా పరిగణించబోమని చెబుతూనే వారిపై ఎలాంటి శిక్షాత్మక చర్యలు ఉండవని అధికారులు స్పష్టత ఇచ్చారు. ఎవరి పేర్లు అయితే జాబితాలో లేవో.. అట్టివారికి మరో అవకాశం ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. వారు NRC వెబ్సైట్ను సందర్శించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని లేదంటే సమీపంలోని NRC సేవా కేంద్రానికి వెళ్లి దరఖాస్తులు ఇవ్వొచ్చని అధికారులు వివరించారు.
అన్నీ అంశాలను ధృవీకరించి తుది జాబితాను ఈ ఏడాది డిసెంబర్లో NRCపట్టికను విడుదల చేస్తామని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా శైలేష్ చెప్పారు. అయితే ఈ జాబితా ప్రకటించిన తర్వాత ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త తీసుకున్నట్లు గౌహతి పోలీస్ కమిషనర్ హిరేన్ నాథ్ తెలిపారు. NRC కార్యక్రమం పూర్తయ్యేవరకు కేంద్ర బలగాలు అక్కడే మోహరించి ఉంటాయని కమిషనర్ హిరేన్ నాథ్ స్పష్టం చేశారు.
మొత్తం 6.56 కోట్ల ప్రూఫ్ డాక్యుమెంట్లుతో పాటు 68.31 లక్షల అప్లికేషన్లు వచ్చాయని చెప్పిన అధికారులు...వీటన్నిటినీ స్కాన్ చేసేందుకు 16 రౌండ్లు తీసుకున్నామని చెప్పారు. ఇదిలా ఉంటే NRC కార్యక్రమం జరుగుతున్న సమయంలో మొత్తం 7 జిల్లాల్లో బార్ పేట, దర్రాంగ్, దిమ హసావ్, సోనిట్ పూర్, కరీంగంజ్, గోలాఘాట్, దుబ్రిలలో అధికారులు 144 సెక్షన్ విధించారు. మరోవైపు కేంద్రం 220 కంపెనీలకు చెందిన ఆర్మ్ పోలీస్ ఫోర్సులను అస్సోంతో పాటు పొరుగు రాష్ట్రాలకు పంపింది.