Tamil Nadu assembly election 2021 results: స్టాలిన్ ఆధిక్యం, కమల్ వెనుకంజ
తమిళనాడు అసెంబ్లీకి తాజాగా జరిగిన ఎన్నికల్లో సూర్యోదయం కొనసాగుతోంది. పదేళ్ల విరామం తర్వాత తమిళ రాజకీయాల్లో డీఎంకే పూర్తిగా ప్రభావం చూపుతోంది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే-కాంగ్రెస్ కూటమి భారీ విజయాన్ని నమోదు చేసేలా కనిపిస్తోంది. ఇప్పటివరకూ ఆధిక్యాలు చూసుకుంటే డీఎంకే కూటమి 125 స్ధానాల్లో ఆధిక్యం చూపుతోంది. ఎన్డీయే కూటమి 90 స్ధానాల్లో ప్రభావం చూపుతోంది.
తమిళనాడులో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు శతవిధాలా ప్రయత్నించిన అన్నాడీఎంకే తొలిసారి బీజేపీతో కలిసి బరిలోకి దిగింది. అయితే అన్నాడీఎంకే పాలనపై వ్యతిరేకత, పార్టీలో లుకలుకలు ఈ ఎన్నికల్లో ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తోంది. పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న డీఎంకేను ప్రజలు ఆదరించినట్లు ఫలితాల సరళి స్పష్టం చేస్తోంది. డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్, ఆయన తనయుడు ఉదయనిధి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం ఆధిక్యంలో ఉండగా.. మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్ హాసన్ తొలి రౌండ్ అధిక్యం సాధించినా రెండోరౌండ్లో వెనుకబడ్డారు.
తొలిరౌండ్ కౌంటింగ్ పూర్తయ్యే సరికి డీఎంకే ఛీఫ్ స్టాలిన్ కొలత్తూరులో 1754 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. బోడినాయకన్నూర్లో డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం 233 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కోయంబత్తూర్ సౌత్లో మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ కాంగ్రెస్ అభ్యర్ధి జయకుమార్పై తొలిరౌండ్లో 46 ఓట్ల ఆధిక్యం సాధించినా రెండో రౌండ్లో వెనుకబడ్డారు. విల్ పట్టిలో శశికళ మేనల్లుడు దినకరన్ 400 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. ధారాపురంలో తమిళనాడు బీజేపీ ఛీఫ్ మురుగన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.