నేడే మినీ సంగ్రామం... ఐదు రాష్ట్రాల్లో 475 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు... పూర్తి వివరాలివే...
నేడే మినీ సంగ్రామం... ఐదు రాష్ట్రాలకు ఇవాళ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. కేరళ,తమిళనాడు రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతానికి మంగళవారం(ఏప్రిల్ 6) ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక అసోంలో చివరిదైన మూడో విడత,బెంగాల్లో మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి. మొత్తంగా ఇవాళ ఒక్కరోజే 475 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇందులో తమిళనాడులో 234 అసెంబ్లీ నియోజకవర్గాలు,కేరళలో 140,అసోంలో 30,పశ్చిమ బెంగాల్లో 31,పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటితో పాటు మలప్పురం,కన్యాకుమారి లోక్సభ స్థానాలకు కూడా మంగళవారం పోలింగ్ జరగనుంది.
పోలింగ్ కోసం ఎన్నికల కమిషన్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు భారీగా భద్రతా బలగాలను మోహరించింది. కోవిడ్ 19 పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఓటర్లు సురక్షితంగా ఓటు వేసేలా ఏర్పాట్లు చేసింది. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పోలింగ్ జరగనుంది.

తమిళనాడులో మొత్తం 6.28కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 3.18కోట్ల మంది మహిళా ఓటర్లు,3.08కోట్ల మంది పురుష ఓటర్లు,7200 మంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారు.మొత్తం 234 అసెంబ్లీ స్థానాల్లో 3,998 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పోలింగ్ కోసం 88,937 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో ఎన్డీయే,యూపీఏ కూటముల మధ్యే ప్రధాన పోటీ ఉండే అవకాశం ఉంది. ఎన్డీయేలో అధికార ఏఐఏడీఎంకే, బీజేపీ, పీఎంకే పార్టీలు ఉండగా... యూపీఏలో డీఎంకే, కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఎండీఎంకే పార్టీలు ఉన్నాయి. కమల్ హాసన్ నేతృత్వంలోని ఎంఎన్ఎం, ఐజేకే, ఏఐఎస్ఎంకే, నామ్ తమిళర్ కట్చి పార్టీలు మరో కూటమిగా పోటీ చేస్తున్నాయి. ఇక టీటీవీ దినకరన్కు చెందిన ఏఎంఎంకే, ఎంఐఎంతో పాటు మరికొన్ని చిన్న పార్టీలతో కలిసి కూటమిగా పోటీ చేస్తోంది.
కేరళ విషయానికి వస్తే... ఈ రాష్ట్రంలో మొత్తం 2.74కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.ఇందులో పురుష ఓటర్లు 1,32,83,724 కాగా మహిళా ఓటర్లు1,41,62,025గా ఉన్నారు. 140 అసెంబ్లీ స్థానాల్లో మొత్తం 957 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈసారి కూడా సీపీఎం నేత్రుత్వంలోని ఎల్డీఎఫ్,కాంగ్రెస్ నేత్రుత్వంలోని యూడీఎఫ్ మధ్యే ప్రధాన పోటీ ఉండనుంది. మంగళవారం(ఏప్రిల్ 6) ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు కేరళలో పోలింగ్ జరగనుంది.
ఇటీవలే ప్రభుత్వం కూలిపోయిన పుదుచ్చేరిలో మంగళవారం 30 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ నేత్రుత్వంలోని సెక్యులర్ డెమోక్రాటిక్ అలయన్స్,ఎన్డీయే నేత్రుత్వంలోని ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్కు మధ్య ప్రధాన పోటీ ఉండనుంది. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ జరగనుంది.
అసోంలో మొత్తం మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తుండగా మంగళవారం చివరి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఇవాళ 40 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ స్థానాల్లో మొత్తం 337 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా... 79,19,641 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మతో పాటు ఆయన కేబినెట్లోని ఐదుగురు మంత్రుల అసెంబ్లీ స్థానాలకు కూడా ఇవాళే ఎన్నికలు జరగనున్నాయి.
ఇక పశ్చిమ బెంగాల్లో మొత్తం 8 విడతల్లో ఎన్నికలు జరగనుండగా నేడు మూడో విడత పోలింగ్ జరగనుంది. మూడో విడతలో భాగంగా 31 స్థానాలకు ఎన్నికలు జరగనుండగా... మొత్తం 205 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మొత్తం 10,817 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 78.5లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.












Click it and Unblock the Notifications