ఏటీఎం చార్జీలకు రెక్కలు? ఇంటర్ చేంజ్ ఫీజు పెంపునకు డిమాండ్!
న్యూఢిల్లీ: ఏటీఎం లావాదేవీలపై ఇంటర్ చేంజ్ ఫీజు పెంచాలంటూ బ్యాంకుల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. వ్యయాలు పెరగడం, డీమోనిటైజేషన్ ప్రభావం, లావాదేవీల సంఖ్య పడిపోవడం ఇందుకు కారణాలుగా ఉన్నాయి.
ఇంటర్ చేంజ్ ఫీజు అంటే... ఒక బ్యాంకు కస్టమర్ ఇంకో బ్యాంకు ఏటీఎం వినియోగించుకున్నప్పుడు చెల్లించాల్సిన చార్జీ. డీమోనిటైజేషన్ తర్వాత దేశవ్యాప్తంగా ఏటీఎంల సంఖ్య కొంత మేర తగ్గింది.

ప్రభుత్వరంగ బ్యాంకుల ఏటీఎంల్లో అన్ని వేళలా నగదు లభ్యం కాని పరిస్థితి నెలకొంది. దీంతో ఆయా బ్యాంకుల కస్టమర్లు నగదు ఉన్న ఇతర బ్యాంకుల ఏటీఎంలను వినియోగించుకుంటున్నారు.
ఫలితంగా వినియోగించుకున్న బ్యాంకు నెట్ వర్క్ కు, ఆ ఖాతాదారుడి మాతృ బ్యాంకు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంకుల కస్టమర్లు ప్రైవేటు బ్యాంకుల ఏటీఎంలను ఎక్కువగా వినియోగించుకున్నారు.
ఈ నేపథ్యంలో ఇంటర్ చేంజ్ చార్జీలు పెంచాలంటూ ప్రైవేటు బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను డిమాండ్ చేస్తున్నాయి. అయితే, ప్రభుత్వరంగంలోని పెద్ద బ్యాంకులు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నాయి.
చార్జీలు పెరిగితే తమపై పడే భారం అధికమవుతుందని ఓ ప్రముఖ ప్రభుత్వరంగ బ్యాంకు డైరెక్టర్ ఒకరు తెలిపారు. సాధారణంగా బ్యాంకులు తమపై పడే భారాన్ని కస్టమర్లకు బదిలీ చేస్తుంటాయి. ఒకవేళ ఇంటర్ చేంజ్ చార్జీలు పెరిగితే మళ్లీ ఆ భారం ప్రజలపైనే పడుతుంది.












Click it and Unblock the Notifications