భారమే: జీఎస్టీ అమలుతో ఏటీఎం ఛార్జీల్లో మార్పులివే
హైదరాబాద్: జీఎస్టీ జులై 1 నుంచి అమలవుతున్న తరుణంలో ఏటీఎం ఛార్జీలు ఎలా ఉండబోతున్నాయనే సందేహం అందరిలోనూ ఉంది. అయితే, జీఎస్టీ అమలుతో ఏటీఎం ఛార్జీల్లో స్వల్ప పెరుగుదల కనిపించనుంది. ఆ వివరాల్లోకి వెళితే.. రూ. 2వేల లోపు డెబిట్, క్రెడిట్ కార్డు లావాదేవీలపై పన్నును మినహాయించారు.
2016 డిసెంబర్కు ముందు ఈ లావాదేవీలపై 15 శాతం పన్ను ఉండేది. ఇకపై 2000 రూపాయలకు పైన జరిపే లావాదేవీలపై గతంలో 15% ఉండగా.. ఇప్పుడు 18% పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
అలాగే, బ్యాంకులు అందించే సేవలపై ఇప్పటి వరకూ 15 శాతం పన్ను చెల్లిస్తుండగా, ఇకపై 18 శాతం చెల్లించాలి. ఆర్టీజీఎస్, నెఫ్ట్ ద్వారా నగదు బదిలీకి ఇకపై 3 శాతం అదనంగా పన్ను చెల్లించాల్సిందే.
కస్టమర్లు ఏటా 50కి మించి చెక్కులు వాడితే 150 రూపాయలు చార్జీ చెల్లించడంతో పాటు సేవా పన్ను అదనంగా చెల్లించాలి. మొబైల్ అలర్ట్ సందేశాలు పంపేందుకు బ్యాంకులు ఇన్నాళ్లూ మూడు నెలలకు 15 రూపాయలు రుసుముగా వసూలు చేస్తున్నాయి. ఇక మీదట 18 రూపాయలు చెల్లించాలి. మొత్తంగా చూస్తే జీఎస్టీ అమలుతో ఏటీఎం వినియోగదారులపై అదనంగా స్వల్ప భారం పడనుందన్నమాట.