అయోధ్య వివాదంలో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం.. నాలుగు రోజుల్లో మొదలు పెడతాం..
ఢిల్లీ : దశాబ్దాలుగా కొనసాగుతున్న అయోధ్య వివాదానికి ఇప్పట్లో తెరపడేలా కనిపించడంలేదు. వివాద పరిష్కారానికి సుప్రీంకోర్టు నియమించి ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ మధ్యవర్తిత్వం ద్వారా సమస్య పరిష్కరించడంలో విఫలమైంది. వారు ఇచ్చిన రిపోర్టును పరిశీలించిన చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్తో కూడిన ధర్మాసనం ఈ నెల 6వ తేదీ నుంచి రోజువారీ విచారణ జరుపుతామని ప్రకటించింది.
ఫలించని మధ్యవర్తిత్వం
కేసు విచారణ సందర్భంగా మధ్యవర్తులు ఎలాంటి పరిష్కారం చూపలేకపోయారని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ ప్రకటించారు. ముగ్గురు సభ్యుల ప్యానెల్ ఈ సమస్యపై అన్ని వర్గాల్లో ఏకాభిప్రాయం తెచ్చేందుకు ప్రయత్నించింది. అయితే కొందరు వారి ప్రతిపాదనలను అంగీకరించలేదు. దీంతో మధ్యవర్తులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. మరోవైపు ఈ ఏడాది నవంబర్ 17న చీఫ్ జస్టిస్ రిటైర్ కానున్నారు. ఈ లోగా ఆయన సమస్య పరిష్కరిస్తూ తుది తీర్పు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
మార్చిలో కమిటీ ఏర్పాటు
చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్తో పాటు జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ అబ్దుల్ నజీర్లతో కూడిన ధర్మాసనం అయోధ్య కేసును విచారిస్తోంది. ఈ ఐదుగురు సభ్యుల ధర్మాసనం మధ్యవర్తిత్వం ద్వారా వివాద పరిష్కారించాలని అభిప్రాయపడింది. అయితే ఈ నిర్ణయాన్ని ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వంతో పాటు సున్నీ వక్ఫ్ బోర్డ్, నిర్మోహి అఖారా,మరో హిందూ పిటీషనర్ తీవ్రంగా వ్యతిరేకించారు. అయినప్పటికీ ధర్మాసనం మీడియేషన్కు మొగ్గుచూపింది. మార్చిలో సుప్రీ కోర్టు మాజీ జడ్జి జస్టిస్ ఎఫ్ ఎం కలీఫుల్లా, స్పిరుచువల్ గురు శ్రీ శ్రీ రవిశంకర్, సీనియర్ అడ్వొకేట్ శ్రీరామ్ పంచులతో త్రిసభ్య ప్యానెల్ ఏర్పాటు చేసింది. ఆగస్టు 15కల్లా నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించింది.
మధ్యవర్తిత్వం వద్దన్న పిటీషనర్లు
మధ్యవర్తిత్వం ద్వారా వివాదం పరిష్కరించాలన్న సుప్రీంకోర్టు నిర్ణయంపై పిటీషనర్ గోపాల్ సింగ్ విశారద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు ప్యానెల్ ఈ విషయంలో ఎలాంటి పురోగతి సాధించకపోవడంతో రోజువారీ విచారణ జరపాలని పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం త్రిసభ్య కమిటీ ఆగస్టు 1కల్లా రిపోర్టు ఇవ్వాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు త్రిసభ్య కమిటీ రిపోర్టు సమర్పించగా.. దాన్ని పరిశీలించిన న్యాయస్థానం మధ్యవర్తిత్వం విఫలమైందని తేల్చింది. 6వ తేదీ నుంచి రోజువారీ విచారణ చేపట్టేందుకు సిద్ధమైంది.