Ayodhya Verdict:వివాదాస్పద భూమిపై హిందూసంఘాలు, ముస్లిం పార్టీల వాదనలేంటి..?
అయోధ్య: కొన్ని దశాబ్దాలుగా నడుస్తున్న అయోధ్య వివాదంకు శనివారంతో తెరపడనుంది. అతి సున్నితమైన ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. వివాదం మొత్తం 2.77 ఎకరాల భూమిపైనే తిరిగింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసును విచారణ చేసింది. మొత్తం 40 రోజుల పాటు సాగిన వాదనలు అక్టోబర్ 16న ముగిశాయి. తీర్పును రిజర్వ్ చేసింది న్యాయస్థానం. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ తాను రిటైర్ అయ్యేలోపు తీర్పు వెలువరించాలని భావించారు.
Ayodhya Verdict: 134ఏళ్లుగా నడుస్తున్న చరిత్ర...మలుపులు, తీర్పులు..నేటితో ముగింపు
2010లో అలహాబాదు హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ హిందూ సంఘాలు, ముస్లిం సంఘాలు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. నిర్మోహి అఖాడా, సున్నీ వక్ఫ్ బోర్డులు, రామ్లల్లాలు ఈ 2.77 ఎకరాల భూమిని సమానంగా పంచుకోవాలంటూ తీర్పు చెప్పింది అలహాబాదు హైకోర్టు. ఈ తీర్పునే సుప్రీం కోర్టులో సవాల్ చేయడం జరిగింది. ఇక ఈ కేసులో వివిధ పార్టీలు ఎలా వాదించాయి.. ఏమని వాదించాయి..?
సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన హిందూ సంఘాలు నిర్మోహి అఖాడా, భగ్వాన్ శ్రీ రామ్ లాలా విరాజ్మాన్, ఆలిండియా హిందూమహాసభ, రామజన్మభూమి న్యాస్ ఉన్నాయి. వీరి ప్రధాన వాదనలు ఈ విధంగా ఉన్నాయి.
* వివాదంలో ఉన్న భూమి మొత్తం రాముడి జన్మస్థలం కాబట్టి అది శ్రీరాముడికే చెందుతుంది
* రాముడు అయోధ్యలో జన్మించాడనేది నమ్మకం
* అక్కడ మసీదు నిర్మాణం చేపట్టినప్పటికీ రాముడు అక్కడే జన్మించాడన్న నమ్మకం మాత్రం హిందువులు కోల్పోలేదు. ఆలయం కూల్చివేసినప్పటికీ విశ్వాసం మాత్రం ఉంది
* ముస్లింలు అక్కడ ప్రార్థనలు నిర్వహించినంత మాత్రానా శ్రీరాముడి జన్మస్థలంపై వారికి హక్కు ఉన్నట్లు కాదు
* బాబ్రీ మసీదులో ఉన్న జంతువులు, మనుషుల చిత్రాలు చూస్తే అది ఇస్లాం మతవిశ్వాసాలకు వ్యతిరేకంగా ఉన్నాయి
* వివాదాస్పద స్థలంలో ఆలయం ఉండేదని ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చెబుతోంది
* శతాబ్దాలుగా అక్కడ పూజలు నిర్వహిస్తున్నాము. దాన్ని పరిరక్షించాలి
* వివాదాస్పద భూమిలో మసీదు నిర్మాణం చేపట్టరాదని ఇస్లాం పవిత్ర గ్రంథం ఖురాన్ చెబుతోంది
* మసీదును బాబర్ నిర్మించలేదు. వివాదాస్పద భూమిపై ఆయన హక్కుదారుడు కాదు. కాబట్టి భూమిపై సున్నీ వక్ఫ్ బోర్డుకు ఎలాంటి హక్కులు లేవు
వాదనలు ఇలా ఉంటే.. హిందూ వర్గాలు ఇలా రుజువు చేసే ప్రయత్నం చేశాయి.
* కొన్ని శతాబ్దాల క్రితం ఇక్కడ ఆలయం నిర్మించారని దీన్ని విక్రమాదిత్యుడు నిర్మించి ఉంటారని చెబుతున్నారు. ఆ తర్వాత తిరిగి 11వ శతాబ్దంలో ఆలయం నిర్మించారని హిందూ సంఘాలు చెబుతున్నాయి
* 1526లో బాబర్ లేదా 17వ శతాబ్దంలో ఔరంగజేబు ఇక్కడి ఆలయాన్ని కూల్చివేశారు
* స్కందపురాణం అప్పటి విదేశీయులు రాసిన చరిత్రను చూస్తే అయోధ్య రాముడి జన్మస్థలం అని చెప్పొచ్చు
* ఇక ఇస్లాం మత ప్రకారం చూస్తే మసీదు నిర్మాణం ఖురాన్ ,హదిత్లకు వ్యతిరేకంగా జరిగింది
ముస్లిం తరపున వాదించి పార్టీల్లో సెంట్రల్ సున్నీవక్ఫ్ బోర్డు మొహ్మద్ ఇక్బాల్ అన్సారీ, సిద్ధిఖ్, సెంట్రల్ షియా వక్ఫ్ బోర్డు ఉన్నాయి. వారి ప్రధాన వాదనలు ఇలా ఉన్నాయి.
* ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్టు స్పష్టంగా లేదని వివాదాస్పద స్థలంలో ఆలయం ఉండి ఉంటే ఎప్పుడు కూల్చారు మసీదును నిర్మాణం ఎప్పుడు జరిగిందనే అంశాలు లేవని వాదించింది
* ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్టు ఎవరు తయారు చేశారు, వారి సంతకం కూడా లేదని అలాంటప్పుడు దీన్ని సాక్షంగా ఎలా పరిగణిస్తారు అని వాదించింది
* ఇక వివాదాస్పద స్థలం రాముడు జన్మించిన స్థలం కాదని అక్కడ ముందునుంచి మసీదు ఉందని అది బాబర్ హయాంలో నిర్మించారని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు
* సెంట్రల్ డోమ్లో హిందువులు పూజలు నిర్వహించినట్లుగా ఎక్కడా రుజువులు లేవు. బయట ప్రాంగణంలో ఉన్న రామ్ చబుతరా వద్ద పూజలు జరిగాయని వాదించింది
* 1949లో తొలిసారిగా సెంట్రల్ డోమ్లో విగ్రహంను ఉంచారని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది
* హిందువుల వాదనలన్నీ అక్కడ యాత్రికులు వచ్చి రాసిన పుస్తకాలు, సంపూర్ణంగా లేని గెజిట్ల పై ఉన్నాయని చెప్పారు
* అన్ని గెజిట్లు తయారు చేసిన వారు అక్కడ మసీదు మాత్రమే ఉందని చెప్పారని అక్కడ జన్మభూమి అనే ప్రాంతం లేదని చెప్పినట్లు గుర్తుచేశారు
* హిందవుల వాదనల్లో ఎలాంటి పసలేదని ముస్లిం పార్టీలు వాదించాయి.
ఇక వాదనలు పూర్తిచేసిన ముస్లిం పార్టీలు వారి వైపే న్యాయం జరుగుతుందనేదానికి పలు అంశాలను ప్రస్తావిస్తున్నారు.
* 1528 నుంచి వివాదాస్పద స్థలంలో మసీదు ఉంది
* 1855 తిరిగి 1934లో ధ్వంసం చేయడం, ఆ తర్వాత 1949లో విగ్రహాలు మసీదు ఆవరణలోకి తీసుకురావడం ఆ తర్వాత 1992 తిరిగి మసీదును ధ్వంసం చేశారనే దానికి అధికారిక డాక్యుమెంట్లు ఉన్నాయి
* మసీదులో 1949 డిసెంబర్ 22, 23 వరకు ప్రార్థనలు జరిగాయనేదానికి సాక్షాలు ఉన్నాయి.
మొత్తానికి వివాదాస్పద రామజన్మభూమి బాబ్రీ మసీదులపై రెండు పార్టీల వాదనలు , రుజువులు పై విధంగా ఉన్నాయి. అయితే తీర్పు ఎలా వస్తుందనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.