కరోనా కష్టకాలంలో కూడా ఆ పథకం కింద 8.8 కోట్ల మందికి ఆరోగ్యసేవలు: కేంద్రం
కోవిడ్-19 సేవలతో పాటు ఇతర సేవలను కూడా ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కిందకు చేర్చి ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించామని కేంద్రం తెలిపింది. 41వేల ఆయుష్మాన్ భారత్ హెల్త్ మరియు వెల్నెస్ సెంటర్లను ఇందుకోసం ఏర్పాటు చేసినట్లు చెప్పిన కేంద్రం... గత ఐదు నెలల్లో వీటి ద్వారా 8.8కోట్ల మందికి లబ్ధి చేకూరిందని వెల్లడించింది. జార్ఖండ్ రాష్ట్రంలో హెల్త్ మరియు వెల్నెస్ సెంటర్లలో పనిచేసే సిబ్బంది రాష్ట్రవ్యాప్తంగా ఇన్ఫ్లుయెంజా, శ్వాసకోశ సంబంధిత వ్యాధులపై సర్వేలు చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ క్రమంలోనే కోవిడ్-19 టెస్టులు కూడా నిర్వహించినట్లు స్పష్టం చేసింది.
ఇక ఒడిషాలో కూడా హెల్త్ మరియు వెల్నెస్ సిబ్బంది హెల్త్ చెకప్ కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా కోవిడ్-19 మహమ్మారిపై అవగాహన కల్పించారని, వ్యాధి నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా ప్రజలకు వివరించారని కేంద్రం తెలిపింది. బహిరంగ ప్రదేశాలకు వెళ్లినప్పుడు మాస్కులు తప్పనిసరిగా ధరించడం, చేతులను శుభ్రంగా కడుక్కోవడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్లు వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించినట్లు కేంద్రం తెలిపింది. రాజస్థాన్కు వచ్చే ప్రతి ప్రయాణికుడికి టెస్టులు హెల్త్ మరియు వెల్నెస్ సెంటర్ సిబ్బంది నిర్వహించిందని చెప్పిన కేంద్రం... మేఘాలయాలో టీచర్లకు, నాయకులకు కోవిడ్-19 పై ఓరియెంటేషన్ క్లాసులు నిర్వహించినట్లు వెల్లడించింది.
ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచి మొత్తంగా 8.8 కోట్ల మందికి కోవిడ్-19తో పాటు ఇతర ఆరోగ్య సంబంధిత విషయాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించామని కేంద్రం తెలిపింది. లాక్డౌన్ సమయంలో కూడా సిబ్బంది ప్రజలను కలిసి వారికి వివిధ వ్యాధులు, వాటి నివారణ చర్యలపై వివరించినట్లు కేంద్రం స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే హైపర్టెన్షన్తో బాధపడుతున్న 1.41 కోట్ల మందికి కూడా పరీక్షలు హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ల ద్వారా చేయడం జరిగిందని కేంద్రం స్పష్టం చేసింది. మధుమేహంతో బాధపడుతున్న 1.13 కోట్ల మందికి, బ్రెస్ట్, సెర్వికల్ క్యాన్సర్తో బాధపడుతున్న 1.34 కోట్ల మందికి కూడా పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
Recommended Video
ఇప్పటి వరకు 6.53 లక్షల సెషన్ల యోగా మరియు వెల్నెస్ కార్యక్రమాలు నిర్వహించినట్లు కేంద్రం చెప్పింది. ఆయుష్మాన్ భారత్ లబ్ధిదారులకు గుర్తింపు పొందిన లేదా ప్రభుత్వం జాబితాలో చేర్చబడిన ప్రైవేట్ ల్యాబరేటొరీల్లో మరియు హాస్పిటల్స్లో ఉచితంగా కోవిడ్-19 చికిత్స జరుగుతుందని వెల్లడించింది. ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన కింద లిస్ట్ అయిన హాస్పిటల్స్ కరోనా పరీక్షల కోసం ఇదే స్కీం కింద ఉన్న పలు ల్యాబులతో జతకట్టొచ్చని కేంద్రం తెలిపింది. 2018లో ఆయుష్మాన్ భారత్ను మోడీ ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పటి వరకు ప్రపంచంలోనే ఇది అతిపెద్ద ఆరోగ్య పథకంగా గుర్తింపు పొందింది. ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన వారి సంఖ్య కోటి దాటిందని ఈ ఏడాది మే నెలలో ప్రధాని మోడీ చెప్పారు. దేశంలో 500 మిలియన్ మంది లబ్ధిదారులకు ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.5 లక్షల వరకు అయ్యే ఆరోగ్య పరీక్షలు, చికిత్సకు అయ్యే ఖర్చును కేంద్రం భరిస్తుంది.