జయప్రద రీ ఎంట్రీకి మోకాలడ్డిన ఆజంఖాన్
లక్నో: తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై ఆశలు వదులుకున్న ప్రముఖ సినీ నటి జయప్రద తిరిగి సమాజ్వాదీ పార్టీలో చేరడానికి ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఎస్పీ సీనియర్ నేత, ఉత్తరప్రదేశ్ మంత్రి ఆజంఖాన్ ఆమెకు మోకాలడ్డుతున్నట్లు చెబుతున్నారు. జయప్రదకు, ఆజంఖాన్కు మధ్య మొదటి నుంచీ పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతగా విభేదాలున్నాయి. ఆమె రీ ఎంట్రీని అడ్డుకోవడంలో ఆజంఖాన్ విజయం సాధించినట్లు చెబుతున్నారు.
బుధవారం రాత్రి పొద్దు పోయిన తర్వాత ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ఎంపికకు జాబితాను పంపించారు. అయితే, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవిని దక్కించుకోవడానికి జయప్రద ప్రయత్నాలు చేశారు. చివరి వరకు ఆమె పేరు ముఖ్యమంత్రి గవర్నర్కు పంపించే జాబితాలో ఉంది. చివరి నిమిషంలో ఆమె పేరును తొలగించి ఆయన జాబితాను పంపించారు.

ఆజంఖాన్ను అసంతృప్తి పరచడం ఇష్టం లేకపోవడంతో అఖిలేష్ యాదవ్ జయప్రద పేరును తొలిగించినట్లు చెబుతున్నారు. శాసన మండలికి జయప్రదను పంపించడానికి ఆమె పేరును ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఖరారు చేశారు. అయితే, ఆజంఖాన్ ఒత్తిడితో ఆమెను తొలిగించారు. అంతేకాకుండా ఆజంఖాన్కు అత్యంత సన్నిహితుడైన సర్ఫరాజ్ ఖాన్ పేరు జాబితాలో చేరింది.
జయప్రదను తిరిగి పార్టీలో చేర్చుకోవడంపై ములాలయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్, శివపాల్ సింగ్ యాదవ్, రామ్ గోపాల్ యాదవ్ నాలుగు విడతలు చర్చలు జరిపి ఆమెను చేర్చుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే, చివరకు ఆజంఖాన్ మాటే నెగ్గింది.
రాంపూర్ నియోజకవర్గంలో ఆజంఖాన్కు, జయప్రదకు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. 2009 లోకసభ ఎన్నికల్లో జయప్రద అభ్యర్థిత్వాన్ని ఆజంఖాన్ బహిరంగంగా వ్యతిరేకించారు. దీంతో ఆయన పార్టీ నుంచి బహిష్కరణకు కూడా గురయ్యారు. అయితే, తర్వాత అమర్ సింగ్కు మద్దతు ఇవ్వడం ద్వారా ఎస్పీ ఆమెను పార్టీ నుంచి బయటకు పంపించేసింది.












Click it and Unblock the Notifications