అజంఖాన్ కార్గిల్ వ్యాఖ్యలు: సైన్యాధికారుల ఖండన
ఘజియాబాద్/బెంగళూరు: సమాజ్వాది పార్టీ(ఎస్పి) సీనియర్ నాయకుడు అజంఖాన్ మంగళవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 1999లో పాకిస్థాన్తో జరిగిన కార్గిల్ యుద్ధంలో భారతదేశం తరపున పోరాడి విజయం సాధించింది ముస్లిం సైనికులేనని ఆయన అన్నారు. ఘజియాబాద్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారింది.
కాగా, ఈ వ్యాఖ్యలపై వన్ ఇండియా సబ్ ఎడిటర్ రిచ్ బాజ్పాయి కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన రిటైర్డ్ ఎయిర్ మార్షల్ బికె పాండేను కలిసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ‘కార్గిల్ ప్రాంతాన్ని అవతలి దేశంలోని ముస్లింలు ముట్టడించి స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు. పాక్ ముస్లింలను భారత సైనికులు(హిందువులు, ముస్లింలు) సమర్థవంతంగా ఎదుర్కొని కార్గిల్ యుద్ధంలో విజయం సాధించారు' అని పాండే తెలిపారు.
అజంఖాన్ వ్యాఖ్యలను ఈ విధంగా తీసుకుంటే సరైనవే అనిపించవచ్చని పాండే వ్యంగ్యంగా స్పందించారు. తన కమ్యూనిటీకి సంబంధించిన ప్రజల మద్దతును ఎన్నికల్లో పొందవచ్చనే ఆలోచనతో అజంఖాన్ ఈ విధమైన వ్యాఖ్యలు చేసివుంటారా అని ప్రశ్నించగా.. ఆ ఆలోచనతో వ్యాఖ్యలు చేసివుంటే మాత్రం అతని సఫలీకృతుడు కాలేడని పాండే తేల్చి చెప్పారు. దేశ ప్రజలకు వాస్తవాలు తెలుసునని ఆయన అన్నారు.
సైనికులు పాసింగ్ అవుట్ పరేడ్ సందర్భంగా ఏ మతానికి చెందిన వారైనా భగవద్గీతా, ఖురాన్, బైబిల్, గురు గ్రంథ్ సాహెబ్ లాంటి పవిత్ర గ్రంథాలపై ప్రమాణం చేస్తారని, ఈ విషయం అజంఖాన్కు తెలిసి ఉండకపోవచ్చునని పాండే అన్నారు. సైన్యంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్కులు ఎవరు ఉన్నప్పటికీ అది పెద్ద విషయం కాదని చెప్పారు.
మరో మేజర్ ర్యాంక్ భారత ఆర్మీ అధికారి.. అజంఖాన్ వ్యాఖ్యలను ఖండించారు. భారత రాజకీయ నాయకులు ఎవరూ ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేసి, బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తించవద్దని ఆయన అన్నారు. ఈ విధమైన వ్యాఖ్యలు చేసేందుకు అజంఖాన్కు ఎంత ధైర్యమని ఆయన అన్నారు. అతనికి ధైర్యముంటే సరిహద్దు వరకు వెళ్లాలని, ప్రతికూలమైన వాతావరణంలో రాత్రింబవళ్లు సైనికులు దేశం కోసం విధులు నిర్వహిస్తున్న తీరును చూడాలని అన్నారు.
నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్డిఏ) లేదా ఇండియన్ మిలిటరీ అకాడమీ(ఐఎంఏ)లో అడ్మిషన్ తీసుకున్న ఏ క్యాడెట్ అయిన బహుల మత సామరస్యాన్ని కలిగి ఉంటారని ఆయన చెప్పారు. కాగా, అజంఖాన్ వ్యాఖ్యలను ఘజియాబాద్ లోకసభ బిజెపి అభ్యర్థి వికె సింగ్ ఖండించారు. కార్గిల్ యుద్ధం ‘భారతీయుల విజయం' అని అన్నారు. భారత సైన్యానికి కులం, మతం, వర్గాలు అంటగడితే ఎవరైనా ఖండించాల్సిందేనని అన్నారు. యుద్ధ విజయం ఏ మతానికో, కులానికో, వర్గానికో చెందినది కాదని అది భారతీయులందరిదీ అని చెప్పారు.