దురహంకారులు: మోడీ మంత్రులపై బాబా రాందేవ్, రాహుల్కు ప్రశంస
న్యూఢిల్లీ: ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ కాంగ్రెస్ పార్టీకి బద్ధ వ్యతిరేకని, భారతీయ జనతా పార్టీ మద్దతుదారుడని అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఆయన బిజెపి మంత్రులపై విమర్శలు కురిపించారు. అంతేగాక, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ప్రశంసించారు.
ఆజ్ తక్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాబా రాందేవ్ మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ ప్రభుత్వంలోని కేంద్రమంత్రులు అహంకారపూరితులని మండిపడ్డారు. అదే సమయంలో మునిగిపోతున్న నావ లాంటి కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ జవసత్వాలు నింపుతున్నారని కొనియాడారు.
‘కాంగ్రెస్ పార్టీని కాపాడుకునేందుకు రాహుల్ గాంధీ కొత్త జీవితాన్ని ప్రారంభించారు. చాలా పెద్ద రాజకీయ పార్టీ అయిన కాంగ్రెస్ శిథిలావస్థకు చేరుకుంటున్న సమయంలో రాహుల్ గాంధీ.. ఆ పార్టీకి జవసత్వాలు నింపుతున్నారు' అని రాందేవ్ పేర్కొన్నారు.
మోడీది ‘సూట్ బూట్ సర్కార్' అన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. సూట్ వేసుకున్నంత మాత్రాన ఎవరైనా క్రిమినల్స్ అవుతారా? అని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసించిన బాబా రాందేవ్.. ఆయన నేతృత్వంలోని పలువురు మంత్రులపై విమర్శలు గుప్పించారు. సదరు మంత్రులు దురహంకారంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
నరేంద్ర మోడీ, అరుణ్ జైట్లీ, అమిత్ షాలు మినహా మిగితా చాలా మంది తమ ఫోన్ నెంబర్లు మార్చేశారని అన్నారు. ఇది సరైన పని కాదు. కొందరు దురహంకారంతో వ్యవహరిస్తున్నారని అన్నారు. వారందరూ ప్రజలకు జవాబుదారులనే విషయం గుర్తుంచుకోవాలని బాబా రాందేవ్ అన్నారు. ఇంతకుముందు కూడా రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లాబీయింగ్ చేసిన వారికే ప్రతిష్టాత్మక పద్మ అవార్డులు వరిస్తున్నాయని ఆరోపించారు.