Babiya: అనంత పద్మనాభ స్వామి ఆలయంలోని శాఖాహార మొసలి కన్నుమూత
తిరువనంతపురం: శాఖాహారం మాత్రమే భుజించే ఆధ్యాత్మిక మొసలిగా పేరు తెచ్చుకున్న బాబియా ఇక లేదు. కేరళలోని కాసరగోడ్ జిల్లాలో ఉన్న శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయానికి ప్రధాన ఆకర్షణగా నిలిచిన 75 ఏళ్ల బాబియా ఆదివారం కన్నుమూసింది.
చెరువులో విగత జీవిగా తేలియాడిన మొసలి బాబియా
ఆదివారం రాత్రి చెరువులో మొసలి మృతదేహం తేలియాడుతూ కనిపించిందని, వెంటనే పోలీసులకు సమాచారం అందించామని ఆలయ అధికారులు తెలిపారు. ఈ శాకాహార మొసలి చివరిచూపు కోసం వందలాది మంది భక్తులు, ప్రముఖులు, రాజకీయ నాయకులు ఆలయానికి తరలివస్తున్నారు. ఈ క్రమంలో ఆలయ అధికారులు.. మొసలి మృతదేహాన్ని భక్తుల సందర్శనార్థం గుడి పరిసరాల్లో ఉంచారు.
బాబియా చరిత్ర.. బ్రిటీష్ పాలకులు కాల్చి చంపిన తర్వాత..
సోమవారం మొసలి మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేస్తామని ఆలయ అధికారులు చెప్పారు. పూజారుల తెలిపిన వివరాల ప్రకారం.. ఒకప్పుడు సరస్సులో పెద్ద మొసలి ఉండేది. బ్రిటీష్ పాలకులు ఆ మొసలిని కాల్చి చంపారు. ఆ తర్వాత అదే సరస్సులో బాబియా కనిపించింది. అయితే అసలు ఈ మొసలి ఎలా వచ్చిందనేది కూడా ఎవరికీ తెలియదు. పైగా దానికి బాబియా అనే పేరు ఎవరు పెట్టారో కూడా తెలియదు. కానీ, అది ఎప్పుడూ క్రూరంగా ప్రవర్తించలేదని, సరస్సులో ఉండే చేపలను కూడా తినలేదని ఆలయ పూజారి వెల్లడించారు. ఈ మొసలి పూర్తిగా శాఖాహారి అని చెప్పారు.
బాబియాతో ఆలయ పూజారికి అవినాభావ సంబంధం
కాగా, అనంత పద్మనాభ ఆలయ పూజారికి, ఈ మొసలికి చాలా అవినాభావ సంబంధం ఉందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. రోజూ పూజారి ఆ మొసలికి రెండు సార్లు అన్నం పెట్టేవారని, ఒక్కోసారి ఆయనే అన్నాన్ని బంతిలా చేసి ఆ మొసలి నోటికి అందించేవారని తెలిపారు. ఆలయంలోని ప్రసాదం కూడా స్వీకరించేదని చెప్పారు. ఆలయాన్ని రక్షించేందుకు దేవుడు నియమించిన సంరక్షకురాలు ఈ మొసలి అని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. గత 75 ఏళ్లుగా ఎంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన బాబియా కన్నుమూసిందన్న వార్త స్థానికంగా విషాద ఛాయలను నింపింది. బాబియాకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో.. నెటిజన్లు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. బాబియా ఆ పద్మనాభుడి దగ్గరకు వెళ్లిందని వ్యాఖ్యానిస్తున్నారు.