3వ రోజు బాబు దీక్ష: ఎపి భవన్ ఖాళీ చేయించాలని లేఖ
న్యూఢిల్లీ: సున్నితమైన అంశం కాబట్టే తాను ఇంతదూరం వచ్చానని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విభజన నిర్ణయం తీరుపై స్పందించారు. ఆయన ఆమరణ నిరీహార దీక్ష బుధవారం మూడో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా బాబు మాట్లాడారు. విభజన నిర్ణయం తీరు సరికాదన్నారు. సమస్య సున్నితమైనది కాబట్టే తాను ఢిల్లీకి వచ్చి దీక్ష చేస్తున్నట్లు చెప్పారు.
ఎన్నికల కోడ్ పేరిట తమ దీక్షను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని, తమ దీక్ష ప్రభావం ఎన్నికల పైన పడదన్నారు. తాను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సమస్యల పైన దీక్ష చేస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెసు ఇష్టానుసారం నిర్ణయం తీసుకోవడం బాధాకరమన్నారు. ఇదంతా ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆడిస్తున్న నాటకమన్నారు.
తన మీద కోపంతో తెలుగు ప్రజల పొట్ట కొట్టవద్దని హెచ్చరించారు. తెలుగు ప్రజల కోసం నిర్మించన ఎపి భవన్లోకి తెలుగు వారిని అనుమతించకపోవడం దారుణమన్నారు. సమస్య పరిష్కారానికి సహకరించాలని ఆయన అందర్నీ కోరారు. ఇప్పటికైనా కాంగ్రెసు పార్టీ కళ్లు తెరవాలని హితదవు పలికారు.
బాబు దీక్షకు అసోం మాజీ ముఖ్యమంత్రి ప్రఫుల్ కుమార్ మహంత మద్దతు పలికారు. ఎపి తాజా పరిస్థితులను కేంద్రం పరిగణలోకి తీసుకోవాలని, ఉద్యోగులు రోడ్ల పైకి వస్తున్నారని, విద్యుత్ నిలిచిపోయిందని, అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను తీసుకోవాలని ప్రఫుల్ సూచించారు.
బాబుపై చర్య తీసుకోవాలని రెసిడెంట్ కమిషనర్ లేఖ
నిబంధనలకు విరుద్ధంగా దీక్ష చేస్తున్న చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎపి భవన్ రెసిడెంట్ కమిషనర్ కేంద్ర హోంశాఖ కార్యదర్శికి, ఢిల్లీ ఈసి, ఈసిలకు లేఖ రాశారు. ఢిల్లీలో కోడ్ ఉన్న సమయంలో అనుమతి లేకుండానే దీక్ష చేస్తున్నారని కమిషనర్ గోయల్ లేఖలు రాశారు.