మోడీ నియోజకవర్గంలో యువకుడిపై గ్యాంగ్ రేప్..
ఉత్తరప్రదేశ్ : ఆడవాళ్లనే కాదు.. మగాళ్లనూ విడిచిపెట్టట్లేదు కొంతమంది మృగాళ్లు. ప్రధాని మోడీ సొంత నియోజకవర్గమైన వారణాసిలో ఓ 19ఏళ్ల యువకుడు గ్యాంగ్ రేప్ కు గురవడం దేశమంతటా చర్చనీయాంశంగా మారింది.
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో.. బెనారస్ వర్సిటీలో ఎంఏ హిందీ చదువుతోన్న 19 ఏళ్ల యువకుడిని ఐదుగురు వ్యక్తులు కలిసి గ్యాంగ్ రేప్ చేశారు. పదిరోజుల క్రితం జరిగిన ఈ ఘటన జరగ్గా.. ఘటనపై స్పందించేందుకు వర్సిటీ వీసీ నిరాకరించడం వివాదస్పదంగా మారింది.
ఘటనా వివరాలను పరిశీలిస్తే.. తన బంధువు మెడికల్ రిపోర్టుల కోసం శ్రీ సుందర్ లాల్ ఆసుపత్రికి వెళ్లిన ఆ యువకుడిని ఐదుగురు వ్యక్తులు అపహరించారు. మైక్రో బయాలజీ విభాగంకు వెళుతున్న క్రమంలో అతన్ని వెంబడించిన దుండగులు.. కారులో అతన్ని అపహరించి అగ్రికల్చర్ వర్సిటీ ప్రాంతంలోకి తీసుకెళ్లారు. అలా.. కదులుతున్న కారులోనే ఆ యువకుడిపై లైంగిక దాడి చేశారు దుండగులు. అనంతరం రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు.
బాధిత యువకుడు పోలీసులకు సమాచారం అందించడంతో.. వైద్య పరీక్షల నిమిత్తం అతన్ని ఆసుపత్రికి తరలించారు పోలీసులు. కాగా, రెండుసార్లు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. గ్యాంగ్ రేప్ జరిగిందన్న విషయాన్ని ధ్రువీకరించారు. ఇదిలా ఉంటే.. దేశంలో ప్రతిష్టాత్మక వర్సిటీగా పేరున్న బెనారస్ విశ్వవిద్యాలయంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటిదాకా ఆడపిల్లల భద్రత విషయంలోనే తలలు పట్టుకుంటున్న ప్రభుత్వాలు.. ఇక నుంచి ఇలాంటి ఘటనలపై కూడా ఫోకస్ చేయాల్సిందే.