మోడీ పిలువు: దత్తాత్రేయకు మంత్రి పదవి ఖాయం
న్యూఢిల్లీ: సికింద్రాబాద్ బిజెపి పార్లమెంటు సభ్యుడు బండారు దత్తాత్తేరియకు మంత్రి పదవి ఖాయమైనట్లే కనిపిస్తోంది. ఆయనకు ప్రధాని నరేంద్ర మోడీ నుంచి పిలుపు అందింది. ప్రధాని కార్యాలయం అధికారులు ఆయనకు ఫోన్ చేసి ఢిల్లీ రావాల్సిందిగా ఆహ్వానించారు. దీంతో ఆయన శనివారం సాయంత్రం ఢిల్లీ వెళ్తున్నారు.
బండారు దత్తాత్రేయ గతంలో కూడా కేంద్ర మంత్రివర్గంలో పనిచేశారు. ఆయన గతంలో సహాయ మంత్రిగా పనిచేశారు. ఈసారి ఆయనకు కేబినెట్ హోదా దక్కుతుందా, సహాయ మంత్రి హోదాతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుందా అనేది వేచి చూడాల్సిందే. నరేంద్ర మోడీ ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో తన మంత్రి వర్గాన్ని విస్తరించనున్న విషయం తెలిసిందే.
నరేంద్ర మోడీ కొత్తగా పది మందిని తన మంత్రివర్గంలోకి తీసుకోవాలని అనుకుంటున్నారు. ఆ పది మందిలో దత్తాత్రేయ ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి కూడా నరేంద్ర మోడీ ఓ మంత్రి పదవి ఇవ్వాలని అనుకుంటున్నారు. ఈ విషయాన్ని నరేంద్ర మోడీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఫోన్ చేసి చెప్పినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం నుంచి సుజనా చౌదరికి మంత్రి పదవి దక్కుతుందని బలంగా వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీకి చెందిన అశోక్ గజపతి రాజు ఇప్పటికే మంత్రిగా ఉన్నారు.
కాగా, తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే ఉద్దేశంతో మోడీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే దత్తాత్రేయను మంత్రివర్గంలోకి తీసుకోవాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. పైగా, తెలంగాణకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించినట్లు కూడా అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి నిర్మలా సీతారామన్ ఇప్పటికే మంత్రివర్గంలో ఉన్నారు. ఆమె ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. వెంకయ్య నాయుడు రాజ్యసభకు మరో రాష్ట్రం నుంచి ఎన్నికైనప్పటికీ ఆయనను ఆంధ్రప్రదేశ్ నాయకుడిగానే భావిస్తూ ఉంటారు. దీంతో దత్తాత్రేయకు తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం కల్పించాలని అనుకున్నట్లు తెలుస్తోంది.
కాగా, తెలంగాణ బిజెపి సీనియర్లకు ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశంతో మోడీ ఉన్నట్లు భావిస్తున్నారు. ఇందులో భాగంగా పార్లమెంటుకు పోటీ చేసి ఓడిపోయిన చెన్నమనేని విద్యాసాగర రావుకు గవర్నర్గా మహారాష్ట్రకు పంపించారు. ఇప్పుడు దత్తాత్రేయకు ప్రాతినిధ్యం కల్పించి తెలంగాణ నేతలకు సానుకూల సంకేతాలు పంపించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. పైగా, దత్తాత్రేయ బిసి కావడం కూడా పార్టీకి కలిసి వస్తుందని అనుకుంటున్నారు.