భీమా కోరెగావ్ హింస కర్ణాటకకు పాకింది: బంద్, వాహనాలు ధ్వంసం, కేంద్ర మంత్రి కారు!
బెంగళూరు: మహారాష్ట్రలోని పుణేలో ఇటీవల చోటుచేసుకున్న భీమా-కోరెగావ్ హింస కర్ణాటకకు పాకింది. హుబ్లి- దారవాడ, కులబర్గి, అళంద, చిక్కోడి లోని పలు దళిత సంఘాలు సోమవారం బంద్కు పిలుపునిచ్చాయి. ఆందోళనకారులు పలు వాహనాలతో పాటు పోలీసు బారికేడ్లు ధ్వంసం చేశారు. కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే కారు అడ్డగించి నిరసన వ్యక్తం చేయ్యడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
యువకుడి హత్య
భీమా-కోరేగావ్ యుద్ధం జరిగి 200 ఏళ్లు కావస్తున్న సందర్భంగా పుణే సమీపంలో ఈ నెల 1వ తేదీన దళిత సంఘాలు వార్షికోత్సవం జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇరు వర్గాల మద్య హింస చోటుచేసుకోవడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
మహారాష్ట్ర
భీమా- కోరేగావ్ హింస మహారాష్టతో సహ దేశ వ్యాప్తంగా దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. ఇప్పుడు ఆ నిరసనలు కర్ణాటకకు వ్యాపించాయి. సోమవారం హుబ్బళి-దారవాడ జంట నగరాల బంద్ కు పిలుపునిచ్చారు.
భారీ బందోబస్తు
హుబ్బళి-దారవాడ జంట నగరాల బంద్ కు పిలుపునివ్వడంతో పోలీసులు గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు. సోమవారం దళిత సంఘాల నాయకులు, కార్యకర్తలు వేల సంఖ్యలో రోడ్ల మీదకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఆ సందర్బంలో రోడ్ల మీద టైర్లకు నిప్పటించి పలు వాహనాలు, పోలీసు బ్యారికేడ్లు ధ్వంసం చేసి ఆందోళనకు దిగారు.
ఆర్ టీసీ బస్సులు
హుబ్బళి-దారవాడ, చిక్కోడి, అళంద, కులబర్గి తదితర ప్రాంతాల్లో బంద్ జరిగింది. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఈ ప్రాంతాల్లో కేఎస్ఆర్ టీసీ బస్సులు పూర్తిగా నిలిపివేశారు. ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వాహనాలు హుబ్బళి-దారవాడ జంటనగరాల్లోకి ప్రవేశించకుండా బైపాస్ నుంచి పంపిస్తున్నారు. విద్యాసంస్థలు మూతపడ్డాయి.
జ్యూబ్లీ సర్కిల్ కు నిప్పు
హుబ్బళి- దారవాడలోని జూబ్లీ సర్కిల్ కు నిప్పంటించిన దళితులు నిరసన వ్యక్తం చేశారు. ఆందోళన హింసకు దారి తీస్తుందని పసిగట్టిన పోలీసులు బలవంతంగా దుకాణాలు మూయించారు. ముందు జాగ్రత్తగా అదనపు బలగాలు, సాయుధ బలగాలను రంగంలోకి దింపారు. కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే కారు అడ్డుకున్న ఆందోళనకారులు నిరసన వ్యక్తం చెయ్యడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు.