తగ్గని మమత-కేంద్రాన్ని ధిక్కరిస్తూ-ప్రభుత్వ సలహాదారుగా బంధోపాధ్యాయ్-కొత్త సీఎస్ ఎవరంటే...
కేంద్రానికి-బెంగాల్ ప్రభుత్వానికి మధ్య 'సీఎస్' విషయంలో నెలకొన్న వివాదం మరింత ముదురుతోంది. యాస్ తుఫాన్పై సమీక్షా సమావేశం కాస్త ఇరువురి మధ్య రాజకీయ తుఫాన్కు దారితీసింది. తదనంతర పరిణామాల్లో కేంద్రం బెంగాల్ సీఎస్ అలపన్ బందోపాధ్యాయ్ను కేంద్ర సర్వీసులకు రీకాల్ చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం(మే 31) ఆయన ఢిల్లీలో రిపోర్ట్ చేయాల్సి ఉంది. కానీ ఇంతలోనే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. బందోపాధ్యాయ్ని బెంగాల్ ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా నియమించారు. ప్రస్తుత పరిస్థితుల్లో సచివాలయంలో ఆయన సేవలు అవసరమని చెబుతూ సీఎం మమతా బెనర్జీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
Recommended Video

హిట్లర్,స్టాలిన్ తరహాలో కేంద్రం : మమతా
సోమవారం(మే 31) మీడియాతో మాట్లాడిన మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. 'కేంద్రప్రభుత్వం అడాల్ఫ్ హిట్లర్,స్టాలిన్ తరహాలో వ్యవహరిస్తోంది. ఇలా ప్రతీకారపూరితంగా వ్యవహరించే కేంద్ర ప్రభుత్వాన్ని మునుపెన్నడూ చూడలేదు. అధికారులు ఏమైనా కట్టుబానిసలా...? జీవితాంతం దేశం కోసం సేవలందించిన ఓ ఉద్యోగిని ఇలా వేధించడం ద్వారా కేంద్రం ఏం సందేశం ఇవ్వాలనుకుంటోంది. కేవలం నన్ను టార్గెట్ చేసేందుకే సీఎస్పై ఇలా దాడి చేస్తున్నారు. కనీసం రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా సీఎస్ను ఎలా రీకాల్ చేస్తారు.' అని మమతా బెనర్జీ కేంద్రాన్ని ప్రశ్నించారు.

వాళ్లను వెనక్కి రప్పించమంటారా : మమతా
'కేంద్ర సర్వీసుల్లో ఎంతోమంది బెంగాలీలు ఉన్నారు. కేంద్రంతో సంప్రదించకుండా వారందరినీ వెనక్కి రప్పించమంటారా... చెప్పండి మిస్టర్ ప్రైమ్ మినిస్టర్,బిజీ ప్రైమ్ మినిస్టర్... మన్ కీ బాత్ ప్రైమ్ మినిస్టర్... ఇప్పుడున్న పరిస్థితుల్లో బెంగాల్కు బందోపాధ్యాయ్ సేవలు అవసరం. ఓవైపు యాస్,మరోవైపు కోవిడ్ నేపథ్యంలో బందోపాధ్యాయ్ సేవలను కొనసాగించాలని మేము భావిస్తున్నాం. అందుకే ఆయన్ను ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తున్నాం. కేంద్రానికి,రాష్ట్రానికి,పేద ప్రజలకు ఆయన సేవలు అవసరం.' అని మమతా బెనర్జీ పేర్కొన్నారు.

ముగిసిన బందోపాధ్యాయ్ పదవీ కాలం
నిన్నటిదాకా బెంగాల్ సీఎస్గా కొనసాగిన బందోపాధ్యాయ్ పదవి కాలం నేటితో ముగిసింది. దీంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. నిజానికి మరో మూడు నెలల పాటు సీఎస్గా బందోపాద్యాయ్ని కొనసాగించాలని బెంగాల్ సీఎం కేంద్రాన్ని కోరారు. ఇందుకు కేంద్రం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ ఇంతలోనే యాస్ తుఫాన్ సమీక్షపై దుమారం చెలరేగడంతో బందోపాధ్యాయ్ని సెంట్రల్ సర్వీసుల్లో వచ్చి చేరాలని కేంద్రం రీకాల్ ఆదేశాలిచ్చింది. రెండు రోజుల క్రితం యాస్ తుఫానుపై ప్రధాని మోదీ నిర్వహించిన సమీక్షా సమావేశానికి సీఎం మమతా బెనర్జీ,సీఎస్ బందోపాధ్యాయ్ 30 నిమిషాలు ఆలస్యంగా వచ్చారన్న ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. మరోవైపు మమత మాత్రం ఆ ఆరోపణలను ఖండించారు. ప్రధాని మోదీయే తమను 30 నిమిషాల పాటు ఎదురుచూసేలా చేశారని ఆరోపించారు.

కొత్త సీఎస్గా ద్వివేది
బెంగాల్ కొత్త చీఫ్ సెక్రటరీగా హరికృష్ణ ద్వివేదిని కేంద్రం నియమించింది. ఆయన 1988 ఐఏఎస్ బ్యాచ్కి చెందిన అధికారి. గతంలో ఆయన బెంగాల్ ప్రభుత్వంలో అడిషనల్ సెక్రటరీగా,హోంశాఖ కార్యదర్శిగా సేవలందించారు. 2012 నుంచి బెంగాల్ పవర్ డెవలప్మెంట్ కార్పోరేషన్ సభ్యుడిగా కొనసాగుతున్నారు. కొత్త సీఎస్ కంటే మాజీ సీఎస్ గురించే ఇప్పుడు ఎక్కువ చర్చ జరుగుతోంది. కేంద్రానికి రిపోర్ట్ చేయకుండా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించిన నేపథ్యంలో ఆయనపై చార్జిషీట్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు కేంద్ర వర్గాలు చెబుతున్నాయి.












Click it and Unblock the Notifications