ఎటిఎం దాడి: అనంతలో మహిళ ఫోన్, అదుపులో వ్యక్తి
బెంగళూరు/అనంతపురం: కర్నాటక రాజధాని బెంగళూరులోని ఓ ఎటిఎం కేంద్రంలో మహిళపై జరిగిన దాడి మరో మలుపు తిరిగింది. ఈ దాడికి సంబంధించి ఓ అనుమానిత వ్యక్తిని ఆంధ్రప్రదేశ్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. అనంతపురం జిల్లా పోలీసులు ఓ అనుమానితుడిని హిందూపురంలో గుర్తించారు.
ఈ విషయాన్ని కర్నాటక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో బాధిత మహిళ పైన దాడి చేసిన వ్యక్తి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్నారు. పోలీసులు బాధితురాలి సెల్ఫోన్ను ట్రేస్ చేసి ఏపిలో ఉన్నట్లు గుర్తించారు. దీంతో అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు యువతి ఫోన్ను అమ్మేసినట్లుగా గుర్తించారు. దీంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నది ఫోన్ కొన్న వ్యక్తిగా తెలుస్తోంది.
ఎటిఎంలో దాడికి గురైన బాధిత మహిళ పేరు జ్యోతి ఉదయ్ కుమార్. ఆమె వయస్సు 38 సంవత్సరాలు. మంగళవారం ఉదయం ఆమెపై దుండగుడు దాడి చేయడంతో ఆమె స్పృహ తప్పి పడిపోయారు. కొన్ని గంటల తర్వాత ఆమెను ఆసుపత్రికి తరలించారు.
నగర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర, అడిషనల్ పోలీసు కమిషనర్(క్రైం) ప్రణబ్ ఆసుపత్రిలో బాధితురాలిని బుధవారం పరామర్శించారు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిందితుడిని గాలించడం కోసం ఎనిమిది టీంలను పంపించామని, ఎపి, తమిళనాడు పోలీసులకు సమాచారం అందించామని చెప్పారు. సిసిటివి ఫుటేజ్ ఆధారంగా నిందితుడు పొడుగ్గా ఉన్నాడని, డార్క్గా, భారీగా ఉన్నాడని చెప్పారు. లైట్ బ్లూ, చెక్స్ షర్డ్ వేసుకున్నాడని తెలిపారు.
కాగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలికి ప్రాణాపాయం తప్పింది. అయితే శరీరంలోని ఆమె కుడి భాగానికి పక్షవాతం వచ్చినట్లుగా గుర్తించినట్లుగా సమాచారం. ఐసియులో ఆమె చికిత్స పొందుతున్నారు.