లావుగా ఉందని పెళ్లి నిలిపేశాడు: యువతి ఆత్మహత్య
బెంగళూరు: అమ్మాయి అబ్బాయి అంగీకరించడంతో ఇరు కుటుంబ సభ్యులు యువతి, యువకుడి వివాహం చెయ్యాలని నిర్ణయించారు. పెళ్లి రోజు నిర్ణయించారు. పెళ్లి పత్రికలు ముద్రించి అందరికి పంచిపెట్టారు. పెళ్లికి కావలసిన బట్టలు, బంగారం కొనుగోలు చేశారు. చిరికి పెళ్లి కుమారుడు జెండా ఎత్తి వేశాడు.
అవమానంతో నాలుగు రోజులలో పెళ్లి చేసుకోవలసిన యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బెంగళూరు నగరంలోని బాణసవాడి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. యువతి మృతికి కారణం అయిన యువకుడిని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.
బాణసవాడిలోని లింగరాజపురంలో రేఖ (24) అనే యువతి నివాసం ఉంటున్నది. ఈమె అదే ప్రాంతంలో బ్యూటి ప్యార్లల్ నిర్వహిస్తున్నది. ఈమె తండ్రి చాల సంవత్సరాల క్రితం మరణించారు. తల్లి ఉన్నారు. రేఖ ఇంటి సమీపంలోనే సోంతంగా బ్యూటి ఫ్యార్లల్ నిర్వహిస్తున్నది.
ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ప్రదీప్ తో రేఖ వివాహం నిశ్చయం అయ్యింది. ప్రదీప్ సంతోషంగా నిశ్చితార్థం చేసుకున్నాడు. కళ్యాణమంటపం బుక్ చేశారు. పెళ్లి నాలుగు రోజులు ఉందనగా ప్రదీప్ అడ్డంతిరిగాడు. అమ్మాయి లావుగా ఉందని తాను వివాహం చేసుకోనని తేల్చి చెప్పాడు.
విషయం తెలుసుకున్న యువతి కుంగిపోయింది. ఆమె బంధువులు నీకు ఇంక పెళ్లి కాదని రేఖను సూటిపోటిమాటలతో మాట్లాడారు. ఇదే విషయంపై విరక్తి చెందిన రేఖ శనివారం రాత్రి ఇంటిలో విషం సేవించింది. విషయం గుర్తించిన ఆమె తల్లి రేఖను ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై రేఖ మరణించిందని పోలీసులు అన్నారు. యువతి ఆత్మహత్యకు కారణం అయ్యాడని ప్రదీప్ ను పోలీసులు అరెస్టు చేశారు.