బ్యాంకాక్ టు ఢిల్లీ: సింగిల్ ఇంజిన్తో ప్రయాణించిన విస్తారా విమానం
న్యూఢిల్లీ: దేశీయ పౌర విమానయాన సంస్థ స్పైస్ జెట్కు చెందిన ఫ్లయిట్లల్లో చోటు చేసుకుంటోన్న వరుస సాంకేతిక లోపాలు ప్రయాణికులను ఆందోళనకు గురి చేస్తోన్నాయి. 18 రోజుల వ్యవధిలో ఎనిమిదిసార్లు ఈ సంస్థకు చెందిన విమానాల్లో ప్రమాదకరంగా లోపాలు తలెత్తాయి. దీనిపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవీయేషన్ విచారణకు ఆదేశించిన కొద్దిసేపటికే అలాంటి ఉదంతమే మరొకటి సంభవించింది.
దేశీయ పౌర విమానయాన సంస్థ విస్తారాకు చెందిన ఫ్లయిట్ యూకే-122లో సాంకేతిక లోపం తలెత్తింది. ఏకంగా ఇంజిన్ ఆగిపోయింది. సింగిల్ ఇంజిన్తోనే ఈ ఫ్లయిట్ ప్రయాణం సాగించింది. బ్యాంకాక్ నుంచి ఢిల్లీకి వచ్చిన విమానం ఇది. సుమారు మూడు గంటల పాటు సింగిల్ ఇంజిన్తో గాల్లో ఎగిరిందీ ఫ్లయిట్. సురక్షితంగా దేశ రాజధానిలో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నట్లు విస్తారా ఓ ప్రకటన తెలిపింది.
బ్యాంకాక్ నుంచి బయలుదేరడానికి ముందు ఈ విమానం రెండు ఇంజిన్లు పని చేశాయి. అక్కడి సువర్ణభూమి అంతర్జాతీయ విమానాశ్రయంలో టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే ఒక ఇంజిన్లో సాంకేతిక లోపాలు తలెత్తాయి. విమానం గాల్లో ఉండగానే అది స్తంభించిపోయింది. మరో ఇంజిన్తో ప్రయాణం సాగించింది. మూడు గంటల అనంతరం ఢిల్లీలో సురక్షితంగా ల్యాండ్ అయింది. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని విస్తారా వెల్లడించింది.
ఎలక్ట్రిసిటీ సమస్య తలెత్తడం వల్ల ఒక ఇంజిన్ స్తంభించిపోయిందని వివరించింది. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన అనంతరం ఈ ఫ్లైయిట్ను మరమ్మతుల కోసం తరలించినట్లు పేర్కొంది. ఈ ఘటనపై డీజీసీఏ అధికారులు ఆరా తీశారు. సమగ్ర నివేదిక అందజేయాల్సిందిగా విస్తారా యాజమాన్యాన్ని ఆదేశించారు. హఠాత్తుగా ఇంజిన్లో లోపం తలెత్తడానికి గల కారణాలను వివరించాలని సూచించారు.