అస్సాంలో డెంటల్ క్లినిక్ పేరిట ఉగ్ర కార్యకలాపాలు
న్యూఢిల్లీ: జమాతే ఉల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్కు చెందిన 30 మంది ఉగ్రవాదులు అస్సాంలో ప్రవేశించినట్లు సమాచారం. అస్సాంకు చెందిన ఓ దంపతుల సహకారం వల్లే వీరు ఇక్కడికి రాగలిగినట్లు తెలుస్తోంది. షహనూర్ ఆలాం, అతని భార్య సుజున అస్సాంలోని బర్పెట జిల్లాలో డెంటల్ క్యాంపు నడిపిస్తున్నారు. వీరి సహకారంతోనే ఉగ్రవాదులు తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్లు సమాచారం.
పేరుకే డెంటల్ క్లినిక్
చాతలలో ఆలాం డెంటల్ క్లినిక్ నిర్వహిస్తుండగా అతని భార్య నిధులను సరఫరా చేస్తోందని ఎన్ఐఏ వర్గాలు పేర్కొన్నాయి. కింది స్థాయి రాజకీయ నాయకులతో ఉగ్రవాద సంస్థ సంబంధాలు ఏర్పాటు చేసుకుంటున్నట్లు కూడా తేల్చాయి. వీరి ద్వారా జెఎంబి మాడ్యుల్స్ స్థానికంగా స్థావరాలు ఏర్పర్చుకుంటున్నాయి. పశ్చిమబెంగాల్, అస్సాంలను బంగ్లాదేశ్లో కలిపి గ్రేటర్ బంగ్లాదేశ్గా మార్చేందుకు జెఎంబి ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నట్లు ఎన్ఐఏ వర్గాల సమాచారం.
పైకి డెంటిస్టుగా విధులు నిర్వహిస్తున్న ఆలాం ఉగ్రవాద సంస్థ జెఎంబితో కలిసి పని చేస్తున్నాడు. జెఎంబిలో చదువుకున్న యువకులను చేర్పించేందుకు అతడు ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు తెలిసింది. చదువుకున్న యువకులను ఆకట్టుకునే మాటలు చెబుతూ వారిని జెఎంబిలో చేర్పించి, పెద్దఎత్తున ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆలాం నిర్వహిస్తున్న డెంటల్ క్యాంపుపై ఎన్ఐఏ నిర్వహించిన దాడిలో ఈ విషయాలన్నీ బయటపడ్డాయి. తన వద్దకు పలువురు యువకులను పిలిపించుకుని వారిని జెఎంబిలో చేర్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తేలింది.
ముఖ్యమైన ఆధారాలపై ఎన్ఐఏ
ఉగ్రవాద కార్యకలాపాలను విస్తృతం చేసేందుకు ఆలాం అస్సాంలోని పలువురు రాజకీయ నాయకులతో 2010 నుంచే సంబంధాలు కొనసాగిస్తున్నట్లు ఎన్ఐఏ విచారణలో తేలింది. ఆలాం తన డెంటల్ క్యాంపును ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక కేంద్రంగా ఎలా మార్చాడు?, అతనికి ఎక్కడి నుంచి నిధులు వచ్చాయనేదానిపై ఎన్ఐఏ విచారిస్తోంది.
జెఎంబికి చెందిన చొరబాటుదారులు బంగ్లాదేశ్ నుంచి తెచ్చిన నిధులను ఆలాం వద్ద ఉంచుతున్నారు. మరోవైపు ఆలాం భార్య సుజున పశ్చిమబెంగాల్లోని మదర్సాలను తరచూ సందర్శిస్తూ ఉంటుంది. ఆమె డెంటల్ క్యాంపులోని నిధులను మదర్సాలలో శిక్షణ పొందుతున్న జమాతే సభ్యులకు, బాంబులు తయారు చేసేందుకు చేరవేస్తుందని ఎన్ఐఏ వర్గాలు పేర్కొంటున్నారు.
ఉగ్రదాడులు చేసేందుకు జెఎంబి విష ప్రణాళిక
జమాతే కోసం వస్తున్న నిధులను డాక్టర్ ఆలాం ఉగ్రవాద సంస్థలో యువకులను చేర్పించుకునేందుకు ఖర్చు చేస్తున్నాడని ఐబి అధికారులు పేర్కొన్నారు. మత సంబంధమైన పవిత్ర స్థలాలో బాంబులు పేల్చి మత ఘర్షణలు సృష్టించి.. ఇంకా ఎక్కువ సంఖ్యలో యువతను ఉగ్రవాదంవైపు మళ్లించేందుకు జెఎంబి కుట్ర పన్నుతోందని వివరించారు. యువతలో అభద్రతా భావాన్ని కలిగించి తమ రక్షణ కోసం జెఎంబిని ఆశ్రయించే విధంగా చేయడమే లక్ష్యంగా దాడులు చేసేందుకు ప్రయత్నిస్తోందని తెలిపారు.
అస్సాంలో ఉగ్రవాద సంస్థ జెఎంబికి సహకరిస్తున్న డాక్టర్కు మద్దతు పలుకుతున్న పలు చిన్నపార్టీలు, రాజకీయ నాయకులను కూడా ఎన్ఐఏ విచారించే అవకాశాలున్నాయి. ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగానే కొందరు కిందిస్థాయి రాజకీయ నాయకులు అతనికి సహకరిస్తున్నట్లు తెలుస్తోందని ఎన్ఐఏ వర్గాలు పేర్కొంటున్నాయి.
జెఎంబి స్థావరంగా మారుతున్న అస్సాం
ఒక్క పశ్చిమబెంగాల్లోనే 55మంది స్లీపర్ సెల్స్ ఉండగా, అస్సాంలో 25 నుంచి 30మంది వరకు ఉన్నట్లు ఎన్ఐఏ వర్గాలు పేర్కొంటున్నాయి. అస్సాంను జెఎంబి తమ ముఖ్య స్థావరంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఉల్ఫా(యుఎల్ఎఫ్ఏ), హుజిలాంటి తీవ్రవాద సంస్థలతో జెఎంబి సంబంధాలను కొనసాగిస్తున్నట్లు సమాచారం.
అస్సాంకు చెందిన సంస్థలు, జెఎంబి సంయుక్తంగా ఉగ్ర కార్యకలాపాలకు ప్రణాళిక వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే జెఎంబి నుంచి వస్తున్న నిధులు ఇక్కడి సంస్థలకు కూడా చేరుతున్నాయి. మరోవైపు అస్సాంకు చెందిన సంస్థల సభ్యులను కూడా జెఎంబి తమలో కలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఎన్ఐఏ వర్గాలు పేర్కొంటున్నాయి.