రేపు దేశవ్యాప్తంగా బ్యాంకుల బంద్..! కేంద్రం స్పందించకపోతే నిరవధిక సమ్మె..!
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న బ్యాంక్ ఉద్యోగులు ఒక్క రోజు సమ్మెకు (Bank Strike) సిద్దమయ్యారు. దేశవ్యాప్తంగా సెప్టెంబరు 11న బ్యాంకుల సమ్మె జరగనుంది. తమ దీర్ఘకాలిక డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో సమ్మెకు దిగాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. అయితే ప్రభుత్వం అప్పటికీ దిగిరాకపోతే నిరవధిక సమ్మె కోసం కూడా ప్లాన్ చేస్తున్నారు. దీంతో దేశంలో బ్యాంకింగ్ సేవలపై తీవ్ర ప్రభావం పడబోతోంది.
వారానికి ఐదు రోజుల పని దినాల డిమాండ్తో పాటు పలు దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం బ్యాంకు ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చిన ఈ నిరసన యథాతథంగా కొనసాగుతుందని యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) స్పష్టం చేసింది. ప్రభుత్వ ప్రతినిధులతో జరిగిన తాజా చర్చలు విఫలం కావడంతో సమ్మెకు వెళ్లడమే ఏకైక మార్గమని యూనియన్లు ప్రకటించాయి. ఢిల్లీలో సెప్టెంబరు రేపటి నుంచి 13 వరకు జరగనున్న ప్రతిష్టాత్మక బ్రిక్స్ సదస్సును దృష్టిలో ఉంచుకుని ఈ సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేయాలని ప్రభుత్వ ఆర్థిక సేవల విభాగం కోరింది. అయితే, ఐదు రోజుల పని విధానాన్ని అమలు చేయడానికి స్పష్టమైన గడువు ప్రకటిస్తే తప్ప వెనక్కి తగ్గేది లేదని యూనియన్ నేతలు తేల్చి చెప్పారు.

చర్చల్లో ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల ప్రతిస్పందన రాకపోవడంతో సమ్మెను కొనసాగిస్తున్నట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (AIBOC) జనరల్ సెక్రటరీ రూపమ్ రాయ్ స్పష్టం చేశారు. ఈ సమ్మె వల్ల దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల సేవలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో వరుస పండుగలు ఉన్నందున, బ్యాంకుల సమ్మె సాధారణ ప్రజలకు, వ్యాపార వర్గాలకు పెద్ద ఆటంకంగా మారనుంది. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కార్యాలయాలు, శాఖలలో కార్యకలాపాలకు ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలిపింది. అయినా లావాదేవీలు ఆలస్యం కావచ్చని ఖాతాదారులను హెచ్చరించింది. ఒకవేళ ఈ డిమాండ్లు నెరవేరకపోతే, సెప్టెంబరు 28 నుంచి 30 వరకు మూడు రోజుల పాటు సమ్మె చేయడమే కాకుండా, అక్టోబరు 26 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని యూనియన్లు హెచ్చరిస్తున్నాయి.














Click it and Unblock the Notifications
