2 రోజులు బ్యాంకుల బంద్: వేతన జీవులకు తిప్పలే?..
Recommended Video
న్యూఢిల్లీ: మే 30,31 తేదీల్లో దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు బంద్లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ కేవలం 2 శాతం వేతన పెంపును ఆఫర్ చేయడాన్ని నిరసిస్తూ ఉద్యోగులు బంద్కు పిలుపునిచ్చారు. నెలాఖరు కావడం, ఉద్యోగుల వేతనాలు కూడా ఈరోజుల్లోనే క్రెడిట్ అయ్యే అవకాశం ఉండటంతో బంద్ ప్రభావం వారిపై పడనుంది.
ఈ నేపథ్యంలో కొన్ని కంపెనీలు తమ ఉద్యోగుల వేతనాలను మంగళవారమే క్రెడిట్ చేసే అవకాశం ఉంది. అయితే వేతనాలు క్రెడిట్ అయినప్పటికీ.. ఏటీఎంలలో విత్ డ్రా చేసుకునే వీలు ఉండకపోవచ్చు. రెండు రోజులు బంద్ కావడంతో ఏటీఎంలలో డబ్బు పెట్టే అవకాశం లేదు. అదీగాక సెక్యూరిటీ గార్డులు సైతం బందులో పాల్గొనే అవకాశం ఉంది కాబట్టి.. ఏటీఎంలు రెండు రోజులు మూతపడే అవకాశం లేకపోలేదు.
ఒకవేళ థర్డ్ పార్టీతో కలిసి ఏటీఎంలలో క్యాష్ అందుబాటులోకి తెచ్చినప్పటికీ.. సెక్యూరిటీ కూడా బంద్ లో పాల్గొంటే వాటి నిర్వహణ కష్టంగా మారుతుంది. రెండు రోజులు బంద్ కావడంతో కస్టమర్లు కూడా భారీగా డబ్బులు విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంది. దీంతో బుధ, గురువారాల్లో నగదు కొరత కూడా ఏర్పడుతుందని అపెక్స్ బ్యాంకు యూనియన్ ఏఐబీఈఏ జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటచలం ముందస్తు హెచ్చరికలు జారీచేశారు.
అయితే ఆన్ లైన్ లావాదేవీలపై మాత్రం ఈ ప్రభావం ఉండబోదు. యథావిధిగా ఆ లావాదేవీలు కొనసాగనున్నాయి. కాగా, బ్యాంకు ఉద్యోగుల వేతన పెంపుకు సంబంధించి ఇప్పటికీ 12సార్లు బ్యాంకు యూనియన్లు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్తో పలు దఫాలుగా చర్చలు జరిపాయి.
మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చాక జన్ ధన్ ఖాతాలు, నోట్ల రద్దు, ముద్రా, అటల్ పెన్షన్ వంటి పథకాలు విజయవంతం కావడం వెనుక తమ పాత్ర కీలకంగా ఉందని, కానీ తమనే పట్టించుకోవడం లేదని బ్యాంకు ఉద్యోగులు వాపోతున్నారు. 2017 నవంబర్ నుంచి పెండింగులో ఉన్న వేతనాల పున:సమీక్షను వెంటనే రివ్యూ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.