జూన్ 1 నుంచి.. శనివారాలు బ్యాంకులు మూత నిజమేనా?
బ్యాంకులకు జూన్ 1 నుంచి ఐదు పనిదినాలు మాత్రమే ఉండనున్నాయని, ప్రతి శనివారం బ్యాంకులకు సెలవని ఇటీవల వాట్సాప్ లో ఓ మెసేజ్ చక్కర్లు కొడుతోంది. ఇది ఎంత వరకు నిజం?
చెన్నై : బ్యాంకులకు జూన్ 1 నుంచి ఐదు పనిదినాలు మాత్రమే ఉండనున్నాయని, ప్రతి శనివారం బ్యాంకులకు సెలవని ఇటీవల వాట్సాప్ లో ఓ మెసేజ్ చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.
అయితే దీనికి సంబంధించి ఇప్పటిదాకా రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదట. దీంతో ఇది కేవలం తప్పుదోవ పట్టించే మెసేజ్ మాత్రమేనని వెల్లడవుతోంది.
సోషల్ మీడియాలో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇటీవల విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా నోట్ల రద్దు తర్వాత నగదు విషయంలో, మిగతా ఆదేశాల విషయంలో ఆర్బీఐ ప్రకటించకున్నా.. ప్రజల్లో భయాందోళన కలిగించే మెసేజ్ లు కొందరు పంపుతున్నారు.
ఇలాంటి మెసేజ్ లు పంపే ముందు ఒక్కసారి రిజర్వు బ్యాంకు అధికారిక ప్రకటనను చెక్ చేసుకోవాలనే వాదనలు వినిపిస్తున్నాయి. బ్యాంకులు కేవలం రెండో, నాలుగో శనివారం మాత్రమే సెలవు దినాలను పాటించనున్నాయి.
2015 ఆగస్టు నుంచి బ్యాంకులు ఈ సెలవును పాటిస్తున్నాయి. రిజర్వు బ్యాంకు నుంచి అధికారికంగా వార్త వెలువడే వరకు ఈ పద్ధతినే బ్యాంకులు పాటించనున్నాయి.