TRP రేటింగులకు బ్రేక్ వేసిన బార్క్... సంస్కరణల కోసమే..!
కొద్ది రోజుల క్రితం పలు న్యూస్ ఛానెల్స్ టీఆర్పీ రేటింగ్స్ కోసం తప్పుదోవ పట్టాయని ముంబై పోలీసులు గుర్తించిన క్రమంలో అది దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది. దీంతో బ్రాడ్క్యాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్ ) సంచలన నిర్ణయం తీసుకుంది. 12 వారాల పాటు టీఆర్పీలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఓ లేఖను విడుదల చేసింది బార్క్. ఇక బార్క్ చెబుతున్న ప్రకారం అన్ని హిందీ ఛానెల్స్, ప్రాంతీయ వార్తా ఛానెల్స్, ఇంగ్లీష్ వార్తా ఛానెల్స్, బిజినెస్ న్యూస్ ఛానెల్స్కు సంబంధించిన టీఆర్పీల లెక్కింపు ప్రక్రియను ఇప్పటి నుంచే నిలిపివేస్తున్నట్లు బార్క్ స్పష్టం చేసింది.
ఈ 12 వారాలకు గాను ఆయా ఛానెల్స్కు సంబంధించి ప్రతి వారం ఇచ్చే టీఆర్పీ రేటింగ్స్ను ఇక విడుదల చేయబోమని తెలిపింది బార్క్. అయితే ఆయా రాష్ట్రం ఆయా భాషల్లో ఉన్న వార్తలపై ప్రేక్షకులు అంచనా ఎలా ఉందో అనేదానిపై మాత్రం నివేదిక విడుదల చేస్తామని బార్క్ స్పష్టం చేసింది. టీఆర్పీ రేటింగ్స్ ట్యాంపరింగ్ జరిగిందంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బార్క్ తెలిపింది. ఈ 12 వారాల్లో బార్క్ టెక్నికల్ బృందం పలు అంశాలను పరిశీలిస్తుందని పలు టెస్టింగులు నిర్వహించి ఎవరికీ టీఆర్పీలను ట్యాంపరింగ్ చేసే అవకాశం లేకుండా ఒక పరిష్కారం చూపుతుందని బార్క్ పేర్కొంది. బార్క్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని న్యూస్ బ్రాడ్ క్యాస్టర్స్ అసోసియేషన్ స్వాగతించింది.
న్యూస్ బ్రాడ్ క్యాస్టర్స్ను రిప్రజెంట్ చేసే ఎన్బీఏ స్పందిస్తూ... టీఆర్పీ రేటింగ్లను సస్పెండ్ చేయడం ఈ సమయంలో మంచి నిర్ణయం అని పేర్కొంది. కొద్ది రోజుల క్రితం టీఆర్పీలను ట్యాంపరింగ్ చేస్తున్నారంటూ వచ్చిన వార్తలు బార్క్కు మాయని మచ్చను తీసుకొచ్చాయని ఎన్బీఏ అధ్యక్షుడు రజత్ శర్మ తెలిపారు. పలు ఛానెల్స్ తమ టీఆర్పీ రేటింగ్స్ కోసం ఉన్నదీ లేనిదీ చూపిస్తూ జర్నలిజం అనే మాటకు అర్థం లేకుండా వ్యవహరిస్తున్నాయని రజత్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఏం చూడాలో ఛానెల్స్ నిర్ణయించడాన్ని తీవ్రంగా తప్పుబట్టిన రజత్ శర్మ ఈ స్థాయికి దిగజారి డేటాను వక్రీకరించి చూపడం సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు.
టీవీ వ్యూయర్షిప్పై వస్తున్న తప్పుడు లెక్కలకు సంబంధించి గత కొన్నేళ్లుగా ఎన్బీఏ అప్రమత్తం చేస్తోందని అయితే కొద్ది రోజుల క్రితం ముంబై పోలీసులు బయటపెట్టడంతో అసలు కథ ప్రపంచానికి తెలిసిందని రజత్ శర్మ అన్నారు. అయితే న్యూస్ ఛానెల్స్ ఈ ఘరానా మోసంలో ప్రధాన పాత్ర పోషించాయని ఆయన ధ్వజమెత్తారు. ఇక ఈ 12 వారాలు సమయంలో బార్క్ కొన్ని సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని వెల్లడించాయి. వ్యూయర్షిప్కు సంబంధించిన సమాచారం సేకరించే సమయంలో మనిషి ప్రమేయం ఉండకూడదని చెప్పారు. ఏవైనా ఫిర్యాదులు వస్తే పారదర్శకమైన విచారణ చేపట్టాలని రజత్ శర్మ విజ్ఞప్తి చేశారు. బార్క్ ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే ఎన్బీఏతో చర్చించాలని తాను భావిస్తున్నట్లు శర్మ చెప్పారు. వ్యూయర్స్ ప్రయోజనాల మేరకే చర్చించి ఆపై కలిసి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు రజత్ శర్మ.